హైదరాబాద్, ఆట ప్రతినిధి: పురుషుల ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్బాల్ టోర్నీ అట్టహాసంగా మొదలైంది. రాష్ట్ర కళా రీతులను అద్భుతంగా ప్రదర్శిస్తూ బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా పోటీలకు తెరలేచింది. రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి మ్యాచ్లను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ హైదరాబాద్ను హ్యాండ్బాల్ హబ్గా మార్చే క్రమంలో పడిన తొలి అడుగు ఇదని అన్నారు. రానున్న రోజుల్లో హ్యాండ్బాల్కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ టోర్నీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. భారత్కు చెందిన టీస్పోర్ట్స్ క్లబ్ 24-37 తేడాతో ఆల్ ఖదీసా (కువైట్) చేతిలో ఓడి నిరాశపరిచింది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్లో ఆల్ అరబీ (ఖతార్) 29-24తో ఆల్ నూర్ (సౌదీ అరేబియా)పై ఉత్కంఠ విజయం సాధించింది.