ఉలన్బాతర్ (మంగోలియా) : ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత బాక్సర్లు దుమ్మరేపుతున్నారు. ఇప్పటికే పలు క్యాటగిరీల్లో 12 పతకాలు ఖాయం కాగా ఆదివారం ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు పురుషులు సెమీస్ చేరారు. టోర్నీ ఏడో రోజైన ఆదివారం జరిగిన క్వార్టర్స్ బౌట్లో భాగంగా మహిళల 48 కిలోల క్యాటగిరీలో మీనాక్షి.. 5-0తో జపాన్కు చెందిన యుకా సదమత్సుపై విజయం సాధించింది.
57 కేజీల విభాగంలో జైస్మిన్.. 5-0తో జియి చెన్ (చైనా)పై గెలిచి సెమీస్కు అర్హత సాధించింది. ఈ ఇద్దరి విజయాలతో టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లిన భారత మహిళా బాక్సర్లందరూ పతకం ఖాయం చేసుకోవడం గమనార్హం. ఇక పురుషుల విషయానికొస్తే లోకేశ్ (85 కి.) 5-0తో గిచానె కిమ్మ (కొరియా)పై నెగ్గగా ఆకాశ్ (75 కి.) 5-0తో బగ్త్యరొవ్ (తుర్కెమినిస్థాన్)పై, హర్ష్ చౌదరి (90 కి.) అలిబేవ్ (కిర్గిస్థాన్)పై గెలిచి సెమీస్ చేరారు.