Asia Cup 2023 | ఆసియా కప్ 2023లో భాగంగా ఫైనల్లో ఎంట్రీ కోసం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 13 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. ప్రమోద్ మధుషన్ ఫఖర్ జామాన్ను (4) క్లీన్ బౌల్డ్ చేయగా.. అబ్దుల్లా షఫీఖ్ (29), బాబర్ ఆజామ్ (22 ) క్రీజులో ఉన్నారు. ఆసియా కప్ను మొదట్నుంచి వరుణుడు వెంటాడుతూనే ఉన్నారు. ఇవాళ జరుగుతున్న మ్యాచ్కు కూడా వరుణుడు అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్ను 45 ఓవర్లకు కుదించారు.
ఇండియాతో ఎవరు ఫైనల్లో ఆడాలన్నా.. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూపర్ ఫోర్ దశలో ఇండియా నాలుగు పాంయిట్లతో టాప్లో ఉంది. ఇక లంక, పాక్లు రెండేసి పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇవాళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక పాయింట్ ఇస్తారు. రిజర్వ్ డే లేని కారణంగా కచ్చితంగా ఫైనలిస్టును తేల్చాల్సి ఉంటుంది. అప్పుడు రెండు జట్లకు మూడేసి పాయింట్లు అవుతాయి. కానీ బెటర్ రన్రేట్ ఉన్న శ్రీలంక.. ఫైనల్లోకి వెళ్తుంది. ప్రస్తుతం శ్రీలంక నెట్ రన్ రేట్ -0.200గా ఉంది. ఇక పాకిస్థాన్ నెట్రన్ రేట్ -1.892గా ఉంది.