నింగ్బో: చైనాలోని నింగ్బో వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్న బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో భాగంగా మంగళవారం ముగిసిన అర్హత రౌండ్ మ్యాచ్లలో భారత యువ షట్లర్లు మాళవిక బన్సోద్ (సింగిల్స్), పాండా సిస్టర్స్గా గుర్తింపు పొందిన రుతపర్ణ-స్వేతపర్ణ (డబుల్స్) మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్లో భాగంగా మాళవిక తొలి మ్యాచ్లో 21-18, 21-5 తేడాతో నురాని (యూఏఈ)ని ఓడించింది. ఆ తర్వాత 21-4, 21-5 తేడాతో ఉజ్బెకిస్తాన్ క్రీడాకారిణి సొఫియా జకిరోవాను మట్టికరిపించింది. తొలి రౌండ్లో మాళవిక.. దక్షిణ కొరియాకు చెందిన 50వ ర్యాంకర్ సిమ్ యు జిన్తో తలపడనుంది. డబుల్స్లో పాండా సిస్టర్స్.. 21-6, 21-6 తేడాతో బంగ్లాదేశ్ ద్వయం ఉర్మి అక్తర్ – నసిమా ఖాటూన్ను చిత్తు చేశారు. చైనా జంట షు జియాన్ ఝంగ్ – యు జెంగ్లతో వీళ్లు తొలి రౌండ్లో తలపడతారు. బుధవారం నుంచి ఈ టోర్నీలో ప్రధాన మ్యాచ్లు జరుగనున్నాయి. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, శ్రీకాంత్, ప్రియాన్షులు బరిలోకి దిగనుండగా మహిళల సింగిల్స్లో పీవీ సింధు, మాళవిక, ఆకర్షి కశ్యప్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల డబుల్స్లో సాయి-కృష్ణ, అర్జున్-ధ్రువ్, హరిహరన్-రుబన్.. మహిళల డబుల్స్లో తనీషా-అశ్విని, ట్రీసా – గాయత్రి, పాండా సిస్టర్స్, సిమ్రన్-రితికాలు బరిలో ఉన్నారు. మిక్స్డ్ డబుల్స్లో ఆధ్య – సతీష్లు పోటీలో ఉన్నారు.