సౌతాఫ్రికా, భారత్ మధ్య టీ20 పోరుకు అంతా సిద్ధంగా ఉన్నారు. సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ల ఓటమికి పగ తీర్చుకోవాలని భారత జట్టు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్పై మాజీ సీమర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అర్షదీప్ సింగ్ ఈ ఐపీఎల్లో కేవలం పది వికెట్లు మాత్రమే తీశాడు.
కానీ అద్భుతమైన ఎకానమీ రేటు మెయింటైన్ చేశాడు. ఇదే విషయం గురించి మాట్లాడిన పఠాన్.. ‘‘ఐపీఎల్ వికెట్ల గురించి మాట్లాడుకుంటే.. అతను ఆడిన మ్యాచులకన్నా వికెట్లు తక్కువే. అయినా సరే సెలెక్టర్లు అర్షదీప్పై నమ్మకం ఉంచారు. దానికి బలమైన కారణం ఉంది. అతను డెత్ బౌలింగ్ చేసే సమయంలో ధోనీ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లను కూడా సైలెన్స్ చేసేస్తాడు.
భారీ షాట్లు ఆడకుండా అడ్డుకుంటాడు. నిలకడగా యార్కర్లు విసురుతాడు’’ అని పఠాన్ వివరించాడు. ఏదో ఒక ఆలోచనతోనే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ను ఎంపిక చేశారని.. అతన్ని అన్ని మ్యాచుల్లో ఆడించాలని అన్నాడు. భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా అర్షదీప్ గురించి మాట్లాడాడు.
భువనేశ్వర్ తర్వాత డెత్ బౌలింగ్ ఎక్స్పర్ట్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగానే అర్షదీప్ను ఎంపిక చేశారని శాస్త్రి అన్నాడు. భువీకి ఏదైనా గాయమైతే డెత్ బౌలర్ ఉండరని, అలాంటి సమయంలో అర్షదీప్ చాలా కీలకంగా మారతాడని చెప్పాడు. ఈ యువ పేసర్కు తన ఆట ఏంటో తెలుసని, అయితే అంతర్జాతీయ స్థాయిలో ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలని వివరించాడు.