కాన్సాస్ సిటీ (యూఎస్) : సాకర్ ప్రపంచకప్లో వరుసగా రెండో ట్రోఫీయే లక్ష్యంగా సాగుతున్న డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఉత్కంఠగా సాగిన పోరులో అర్జెంటీనా.. 3-1తో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీస్కు ప్రవేశించింది. నిర్ణీత సమయంలో స్కోర్లు 1-1తో సమమైనా ఎక్స్ట్రా టైమ్లో రెండు గోల్స్తో రెచ్చిపోయిన మెస్సీ సేన.. 72 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ క్వార్టర్స్కు చేరిన స్విస్కు చెక్ పెట్టింది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మ్యాక్ అలిస్టర్ (10వ నిమిషంలో), జులియన్ అల్వరెజ్ (112వ), లౌటారొ మార్టినెజ్ (120+1వ) చెరో గోల్స్ చేసి తమ జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. స్విస్ నుంచి డన్ డొయె (67వ) ఏకైక గోల్ కొట్టాడు. ఈ గెలుపుతో అర్జెంటీనా.. వచ్చే గురువారం ఇంగ్లండ్తో జరుగబోయే సెమీస్లో అమీతుమీ తేల్చుకోనుంది.
రౌండ్ ఆఫ్-32లో కాబొ వెర్డెతో, ప్రిక్వార్టర్స్లో ఈజిప్ట్తో జరిగిన మ్యాచ్లతో పోలిస్తే అర్జెంటీనా ఈ పోరులో ఆది నుంచే ప్రత్యర్థిపై ఎటాకింగ్కు దిగింది. కానీ ఆటలో బంతిపై సగం కంటే ఎక్కువసేపు బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకున్నా స్విస్ రక్షణ శ్రేణి వారిని సమర్థవంతంగా నిలువరించింది. ఆట ఆరంభంలోనే వచ్చిన కార్నర్ కిక్ను అర్జెంటీనా గోల్గా మలుచుకుంది. మెస్సీ అందించిన బంతిని గోల్ పోస్ట్కు సమీపంలో ఉన్న అలిస్టర్.. తలతో నెట్లోకి పంపి గోల్స్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత స్విస్ డిఫెన్స్తో మెస్సీ అండ్ కో.ను విసిగించింది. గత 5 మ్యాచ్ల్లో ప్రత్యర్థులకు 3 గోల్స్ మాత్రమే ఇచ్చుకున్న ఆ జట్టు.. అర్జెంటీనా గోల్స్ చేయకుండా నిలువరించడంలో పూర్తిగా విజయవంతమైంది. సెకండాఫ్లో స్విట్జర్లాండ్ ప్లేయర్ల నుంచి బంతిని అందుకున్న డోయె.. దుర్బేధ్యమైన అర్జెంటీనా డిఫెన్స్ను దాటుకుంటూ గోల్ సాధించడంతో స్కోర్లు సమమయ్యాయి. అయితే ఆ కొద్దిసేపటికే ఆ జట్టు బ్రీల్ ఎంబోలాకు రెడ్ కార్డు రావడంతో పదిప్లేయర్లతోనే ఆడినా ప్రత్యర్థిని అడ్డుకోవడంలో సఫలమైంది.

నిర్ణీత సమయంలో గోల్స్ కోసం ఇరుజట్లు యత్నించినా ఫలితం లేకపోవడంతో ఆట అదనపు సమయానికి దారితీయసింది. దీంతో గత మ్యాచ్ల్లో మాదిరిగానే అర్జెంటీనా అభిమానుల్లో మరోసారి ఉత్కంఠ రేగింది. అయితే స్విస్ గోల్ కార్నర్ సమీపం నుంచి లోపెజ్ అందించిన పాస్ను అందుకున్న అల్వరెజ్.. బాక్స్ ఆవలినుంచి బంతిని స్విస్ డిఫెన్స్ ప్లేయర్ల తలల మీదుగా బలంగా తన్ని గోల్ కొట్టడంతో అర్జెంటీనా ఊపిరి పీల్చుకుంది. ఎక్స్ట్రా టైమ్ ముగుస్తుందనగా మార్టినెజ్ చేసిన సూపర్ గోల్తో ఆ జట్టు ఘనవిజయం సాధించింది.
వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్ సైతం మెగా టోర్నీ సెమస్కు చేరుకుంది. ఆదివారం తెల్లవారుజామున మియామి గార్డెన్స్లో జరిగిన పోరులో ఇంగ్లండ్.. 2-1తో నార్వేను చిత్తుచేసి ఆ జట్టు పోరాటానికి తెరదించింది. టోర్నీలో దుమ్మురేపుతున్న ఇంగ్లిష్ స్టార్ ప్లేయర్ జూడ్ బెల్లింగ్హమ్ (45+2వ, 93వ) డబుల్ ధమాకాతో ఆ జట్టు 2018 తర్వాత వరల్డ్ కప్ సెమీస్కు అర్హత సాధించింది. గ్రూప్, నాకౌట్ దశలో స్ఫూర్తిధాయక ఆటతో ఆకట్టుకున్న నార్వే పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది. ఆండ్రియస్ (36వ) గోల్తో మ్యాచ్లో తొలి గోల్ కొట్టి ఆ తర్వాత ప్రత్యర్థికంటే ఎక్కువసార్లు ఇంగ్లిష్ గోల్ పోస్ట్పై ఎదురుదాడులకు దిగినా నార్వేకు హ్యారీ కేన్ సేన ఆ అవకాశమివ్వలేదు. కానీ ఫస్టాఫ్ స్టాపేజ్ టైమ్తో పాటు నిర్దేశిత సమయం ముగుస్తుందనగా బెల్లింగ్హమ్ మ్యాజిక్తో ‘త్రీ లయన్స్’ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.1
1 ఫిఫా ర్యాంకింగ్స్లో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్రపంచకప్ సెమీస్కు చేరడం ఇదే మొదటిసారి.
సెమీస్లో ఎవరితో ఎవరు?
జూలై 15 ఫ్రాన్స్ x స్పెయిన్
జూలై 16 అర్జెంటీనా x ఇంగ్లండ్