Delhi : ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రస్థాయికి తగ్గిపోవడంతో ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. బీఎస్ 3 ఇంజిన్ పెట్రోల్ వాహనాలు, బీఎస్ 4 డీజిల్ వాహనాలపై నిషేధం విధిస్తూ రవాణా శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 9 వరకు వీటిపై నిషేధం కొనసాగనుంది. అయితే, అత్యవసర సేవల వాహనాలతో పాటు ప్రభుత్వ, ఎన్నికల విధులకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. అంతేకాదు నిషేధాజ్ఞలను ఉల్లఘించినవాళ్లకు రూ. 20 వేల జరిమానా విధించనున్నారు.
కేంద్ర గాలి కాలుష్య కమిటీ ఇచ్చిన ఆదేశాలు, మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం పెట్రోల్తో నడిచే బీఎస్ 3, డీజిల్తో నడిచే బీఎస్ 4 వాహనాలపై నిషేధం విధిస్తున్నాం. డిసెంబర్ 9వ తేదీ వరకు లేదా గాలి నాణ్యత మెరుగుపడేంత వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది అని ఢిల్లీ రవాణా శాఖ తెలిపింది.
ఢిల్లీలో గాలి నాణ్యత 400 పాయింట్లకు పడిపోవడంతో కేంద్ర గాలి నాణ్యత కమిటీ మూడంచెల పరిమితులు విధించింది. దాంతో ఆదివారం 407 పాయింట్లు ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సోమవారం 60 పాయింట్లు తగ్గింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు గాలి నాణ్యత 347 పాయింట్లు ఉంది.