ఓస్లో: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లి చరిత్ర సృష్టించిన భారత యువ రెజ్లర్ అన్షు మాలిక్ (57 కిలోలు) వెండి వెలుగులు విరజిమ్మింది. పసిడి పతక పోరులో తొలి మహిళా రెజ్లర్గా నిలిచిన అన్షు..పోరాడి ఓడింది. గురువారం జరిగిన మహిళల 57 కిలోల ఫైనల్లో అన్షు 1-4 తేడాతో అమెరికా రెజ్లర్ హెలెన్లూసీ మారోలిస్ చేతిలో ఓటమిపాలైంది. బౌట్లో ఆది నుంచే అన్షుపై మారోలిస్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఉడుం పట్టుతో ఊపిరి సలుపకుండా చేసి పాయింట్లు కొల్లగొట్టింది. ముఖ్యంగా అన్షు కుడి భుజాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా రెజ్లర్ చెలరేగింది. విడిపించుకునేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. మారోలిస్ పట్టుకు తట్టుకోలేకపోయిన అన్షు చివరగా ఓటమి వైపు నిలిచింది. నొప్పి తీవ్రత తట్టుకోలేకపోయిన ఈ యువ రెజ్లర్ కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత వైద్య సహాయంతో పోడియంను వీడింది. మొత్తంగా ప్రపంచ చాంపియన్షిప్లో ఇప్పటి వరకు సుశీల్కుమార్ 2010లో స్వర్ణం గెలువగా, మహిళల్లో గీతా ఫోగట్, బబితా ఫోగట్, పూజ దండా, వినేశ్ ఫోగట్ కాంస్య పతకాలు గెలువగా అన్షు ఐదో రెజ్లర్గా నిలిచింది. మరోవైపు స్వీడన్ రెజ్లర్ సారా జోహాన్నపై 8-2తో అద్భుత విజయం సాధించిన సరితా మోర్ కాంస్య పతకం దక్కించుకుంది. మొత్తంగా ఈ టోర్నీలో భారత్కు రెండు పతకాలు దక్కాయి.