Swapna Barman | హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో మెరిసిన తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందినిపై.. భారత్కే చెందిన మరో అథ్లెట్ స్వప్న బర్మన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 19వ ఏషియన్ గేమ్స్ హెప్టాథ్లాన్లో నందినితో కలిసి బరిలోకి స్వప్న.. 5708 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. పోటీల అనంతరం స్వప్న బర్మన్ సోషల్ మీడియాలో.. ‘ట్రాన్స్జెండర్ మహిళ చేతిలో నేను కాంస్య పతకం కోల్పోయా’అని పేర్కొంది. 2018 జకార్తా క్రీడల్లో హెప్టాథ్లాన్లో స్వర్ణం నెగ్గిన బర్మన్ ట్వీట్ వైరల్గా మారగా.. కొన్ని గంటల తర్వాత దాన్ని డిలీట్ చేసింది.
దీనిపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు సుమరివాలాను సంప్రదించగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు. ఈ అంశంపై నందిని మాట్లాడుతూ.. ‘నాకేం అర్థం కావడం లేదు. ఆమెకు ఏదైనా ఇబ్బంది ఉంటే ముందే ఎందుకు చెప్పలేదు. కష్టపడి కాంస్య పతకం నెగ్గిన తర్వాత ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. నేను దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలనే శ్రమించా’ అని పేర్కొంది.