న్యూఢిల్లీ: ప్రతిభకు గుర్తింపు దక్కింది. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువ పేసర్ అంజలి సర్వాణికి భారత జట్టులో చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో ఈ నెల 9 నుంచి మొదలవుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జాతీయ సెలెక్షన్ కమిటీ శుక్రవారం జట్టును ఎంపిక చేసింది. ఇటీవల రాయ్పూర్ వేదికగా జరిగిన మహిళల టీ20 చాలెంజర్ టోర్నీలో లెఫ్టార్మ్ పేసర్ అంజలి నాలుగు మ్యాచ్ల్లో 5.50 సగటుతో మూడు వికెట్లు దక్కించుకుంది. భారత్ ‘డి’తో జరిగిన మ్యాచ్లో మూడు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి 11 పరుగులే ఇచ్చుకుంది. తనదైన స్వింగ్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెడుతున్న అంజలి ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుని జాతీయ జట్టులో చాన్స్ ఇచ్చారు. గాయం కారణంగా స్టార్ పేసర్ పూజ వస్ర్తాకర్ ఆసీస్తో సిరీస్కు దూరమైంది.