Amit Mishra Congratulates NewZealand | ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద తలనొప్పి తీసుకొస్తాయి. భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా విషయంలో కూడా అదే జరిగింది. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిల్యాండ్ జట్టును ఆస్ట్రేలియా ఓడించిన సంగతి తెలిసిందే.
8 వికెట్లతో విజయం సాధించిన కంగారూలు తొలిసారి పొట్టి ప్రపంచకప్ను ముద్దాడారు. ఈ క్రమంలో ఆ జట్టుకు అభినందనలు వెల్లువలా వచ్చాయి. అలాగే వారికి శుభాకాంక్షలు చెప్పాలనుకున్న మిశ్రా పొరబడ్డాడు. ఆస్ట్రేలియా జట్టుకు బదులుగా కివీస్కు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఇక చూస్కోండి. నెటిజన్లు ఆగుతారా? అమిత్ మిశ్రాను టార్గెట్ చేస్తూ విపరీతమైన ట్రోలింగ్ చేశారు.
ఈ సందర్భంగా కొందరు మరో అడుగు ముందుకేసి ఖేల్రత్న అవార్డు అందుకుంటున్న శిఖర్ ధవన్ ఫొటో షేర్ చేస్తూ.. ‘ఖేల్రత్న అవార్డు అందుకున్న అమిత్ మిశ్రాకు అభినందనలు’ అంటూ వెక్కిరింపులు మొదలుపెట్టారు.
‘ఈ రోజు రెండు పెగ్గులు ఎక్కువ తాగేసినట్లు ఉన్నావ్‘, ‘మత్తు ఎక్కువైనట్లుంది’, ‘ఏదో చీప్ మందు తాగావా?’ అంటూ విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడుగానీ తాను చేసిన పొరపాటేంటో మిశ్రాకు అర్థంకాలేదు. వెంటనే తన ట్వీట్ను డిలీట్ చేసి, ఆస్ట్రేలియాను అభినందిస్తూ మరో ట్వీట్ చేశాడు.