హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్యాన్స్ హద్దులు మీరుతున్నారు. ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని విమర్శించినందుకు హైదరాబాదీ అంబటి రాయుడు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ బెదిరింపులకు దిగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని రాయుడు స్నేహితుడు సామ్పాల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రానా ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకున్నట్లు కాదని రాయుడు చేసిన విమర్శలు జీర్ణించుకోలేని ఆర్సీబీ ఫ్యాన్స్..అతని భార్యతో పాటు ఇద్దరు చిన్న పిల్లలపై లైంగిక దాడితో పాటు చంపేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నాడు.
‘కొంత మంది ఆర్సీబీ ఫ్యాన్స్..రెచ్చిపోయి రాయుడు కుటుంబంపై దాడికి ప్రయత్నిస్తున్నారు. రాయుడు భార్య, కూతుళ్లను లక్ష్యంగా చేసుకుంటూ చంపేస్తామంటున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు, న్యాయవ్యవస్థ కలుగజేసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని రాసుకొచ్చాడు.