Ambati Rayudu: గతకొద్ది రోజులుగా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. నేడు ఏపీ సీఎం జగన్ను కలవడంతో ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లైంది.
గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు గతంలోనే తెలిపాడు. దీంతో ఏ పార్టీలో చేరనున్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది. రాయుడిని ఏపీ బీఆర్ఎస్లోకి తీసుకునేందుకు ఆ పార్టీకి చెందిన ఏపీ అధ్యక్షుడు తోటం చంద్రశేఖర్ అంబటి రాయుడిని కలిసినట్లుగా కూడా వార్తలొచ్చాయి. అంతేకాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఆఫర్ చేసినట్లుగా కథనాలు వెలువడ్డాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. టీడీపీలో చేరే అవకాశం ఉందని పలువురు భావించారు.
ఇటీవల ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా చేసిన ప్రసంగాన్నిరాయుడు ట్విట్టర్లో రీట్వీట్ చేశాడు. అంతేకాకుండా.. ‘గొప్ప స్పీచ్ సార్.. మీ మీద రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయి’ అని ట్వీట్ చేశాడు. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరనున్నాడనే ప్రచారం జోరుగా సాగింది.
వైసీపీలో చేరనున్నాడనే వార్తలకు బలం చేకూరుస్తూ అంబటి రాయుడు నేడు ఏపీ సీఎం జగన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అంబటి రాయుడు క్రికెట్ అకాడమీ పెట్టే ఆలోచనలో ఉన్నాడని, దానికి సంబంధించి భూమి అడిగేందుకు జగన్ను కలిశారన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. జగన్తో భేటీపై అటు రాయుడు గానీ, సీఎంవో గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Great speech ..our chief minister@ysjagan garu.. everyone in the state has complete belief and trust in you sir.. https://t.co/gw4s1ek1LR
— ATR (@RayuduAmbati) April 19, 2023