ముంబై: సీనియర్ బ్యాటర్ అంబటి తిరుపతి రాయుడు వచ్చే దేశవాళీ సీజన్లో హైదరాబాద్ జట్టును వీడి బరోడా తరఫున ఆడనున్నట్లు సమాచారం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయుడు ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా.. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించి ఆ తర్వాత డిలీట్ చేసిన విషయం తెలిసిందే. లీగ్ ప్రారంభానికి ముందే రాయుడు తమను సంప్రదించాడని బరోడ క్రికెట్ సంఘం ప్రతినిధి వెల్లడించారు. ‘ఐపీఎల్ ఆరంభానికి ముందే రాయుడు మాతో చర్చించాడు. బరోడా తరఫున ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ అంశం అపెక్స్ కౌన్సిల్లో చర్చించాం’ అని ఆయన తెలిపారు. గతంలో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించిన రాయుడు నాలుగేండ్ల పాటు పాటు బరోడా జట్టుతో కొనసాగాడు. టీమ్ఇండియా తరఫున అంబటి 55 వన్డేలు, 6 టీ20లు ఆడాడు.