హైదరాబాద్ (ఆట ప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా బాధ్యతలు చేపట్టిన అంబటి రాయుడు సంఘంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా 2026-27 సీజన్కు గాను సీనియర్, జూనియర్ విభాగాలకు కొత్త సెలెక్షన్ కమిటీలను సోమవారం ప్రకటించాడు. సీనియర్ సెలెక్షన్ కమిటీకి మాజీ క్రికెటర్ పి. అక్షత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తాడు.
టి. సుమన్, మెహదీ హసన్, టి. పవన్ కుమార్, ఇందర్ శేఖర్ రెడ్డి సెలెక్టర్లుగా ఉంటారు. ఆకాష్ భండారి నేతృత్వంలోని జూనియర్ సెలెక్షన్ కమిటీలో పి. రమేష్ కుమార్, షోయబ్, సర్వేశ్ కుమార్, తిమోతి రవి కుమార్ సభ్యులుగా ఉంటారని రాయుడు తెలిపాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏఈ) ఎంపిక చేయాల్సిన సెలెక్షన్ ప్యానెళ్లను హైకోర్టు సింగిల్ మెంబర్ కమిటీ హెడ్ జస్టిస్ పి. నవీన్ రావు మార్గనిర్దేశాల మేరకు ప్రకటిస్తున్నట్టు రాయుడు, హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు.
ఇకపై, ప్రతీ సెలెక్షన్ సమావేశాన్ని ఆడియో, వీడియో రూపంలో రికార్డ్ చేస్తారని, దేశంలోనే తొలిసారిగా ఒక ఆటగాడిని ఎంపిక చేయడానికి లేదా తొలగించడానికి గల కారణాలను సెలెక్టర్లు లిఖితపూర్వకంగా పేర్కొనాల్సి ఉంటుందని రాయుడు వెల్లడించాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలికితీసేందుకు సుమారు 3,000 మంది ఆటగాళ్లతో నగరంలో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపాడు.
లీగ్, సూపర్ లీగ్, సెలెక్షన్ మ్యాచ్లతో కూడిన మూడు అంచెల ఫార్మాట్ ద్వారా ప్రతిభ ఆధారంగానే రాష్ట్ర జట్టుకు ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశాడు. ఈ మొత్తం ప్రక్రియలో రాయుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఓపెన్ ట్రయల్స్కు జిల్లాల నుంచి వచ్చే క్రికెటర్ల కోసం ప్రయాణ, వసతి ఖర్చులను హెచ్సీఏనే భరిస్తుందన్నారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధితో పాటు మహిళా క్రికెట్ కోసం త్వరలోనే స్పష్టమైన ప్రణాళికలు వెల్లడిస్తామని ప్రకటించారు.