Ambati Rayudu: ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్సీ విషయం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎంఎస్ ధోనీ(MS Dhoni), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే.. ఈమధ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు వీడ్కోలు పలికినఅంబటి రాయుడు(Ambati Rayudu) మాత్రం ఆ వార్తల్ని ఖండించాడు. ధోనీ, జడ్డూ మధ్య ఎలాంటి విభేదాలు రాలేదని, వాళ్ల మధ్య దూరం పెరిగిందనే వార్తల్లోనూ నిజం లేదని రాయుడు చెప్పాడు. అదంతా మీడియా కల్పిత కథనమే అని అతను తెలిపాడు.
బిహైండ్వుడ్స్ టీవీ(Behindwood TV) ఇంటర్వ్యూలో మాట్లాడిన అంబటి రాయుడు.. ‘మహీ భాయ్తో జడ్డూ అసంతృప్తితో ఉన్నాడని నేను అనుకోను. అయితే.. ఆ సీజన్లో జడేజా బాధతో ఉండడానికి కారణం ఏంటంటే..? జట్టు ప్రదర్శన ఏమంత బాగాలేకపోవడమే. ఆ ఏడాది మేమంతా స్థాయికి తగ్గట్లు ఆడడంలో విఫలమయ్యాం. అంతేకాదు సీజన్ తర్వాత పక్కటెముకల(Rib Injury) గాయంకారణంగా జడేజా బ్రేక్ తీసుకున్నాడు. జట్టు వైఫల్యంతో నిరాశ చెందిన అతను మానసిక ప్రశాంతత కోసం విరామం తీసుకున్నాడు. అంతే తప్ప ధోనీతో అతడికి ఎలాంటి విభేదాలు లేవు’ అని చెప్పుకొచ్చాడు.
ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా
అంతేకాదు సీఎస్కే ఫ్రాంచైజీతో తన అనుబంధం, ధోనీ కెప్టెన్సీ, కీలక ఆటగాడిగా జడేజా ఎదిగిన తీరును అతను వివరించాడు. ‘ఈ జట్టును ధోనీ తీర్చిదిద్దాడు. జడేజాను అత్యుత్తమ ఫినిషర్గా మార్చాడు. ధోనీ గత10 -12 ఏళ్ల నుంచి జడేజా ఆట మెరుగవ్వడంలో సాయపడుతున్నాడు. ఈసీజన్లో చాంపియన్గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని రాయుడు వెల్లడించాడు.
ఐపీఎల్ ట్రోఫీతో రాయుడు
అంతేకాదు ధోనీ మరోసీజన్ చెన్నై కెప్టెన్గా కొనసాగాలని అతను ఆకాంక్షించాడు. 16వ సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను ఓడించి చెన్నై ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. జడేజా(11 నాటౌట్) ఆఖరి రెండు బంతులకు సిక్స్, ఫోర్ బాది జట్టును గెలిపించాడు. దాంతో, ఐపీఎల్ చాంపియన్గా రాయుడుకు ఘనమైన వీడ్కోలు లభించింది.