హైదరాబాద్, ఆట ప్రతినిధి: అవినీతిలో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)కు ఎలాంటి భూ కేటాయింపులూ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ఫోర్త్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదిత క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ)కు భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. జంట నగరాలకు మాత్రమే పరిమితమైన హెచ్సీఏ సంఘం 90 ఏండ్ల చరిత్రలో హైదరాబాద్ వెలుపుల ఒక్క స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు.
ఉప్పల్ స్టేడియం నిర్మాణంలోనూ అవినీతి ఆరోపణలతో 42 మంది హెచ్సీఏ సభ్యులపై ఏసీబీ కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాల్లో క్రికెట్ కార్యకలాపాలకు సంబంధించి టీసీఏను హెచ్సీఏ సంప్రదించాలనే అంశంపై న్యాయస్థాన ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ క్రికెటర్ల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని, ప్రతిపాదిత అంతర్జాతీయ స్టేడియం భూమిని టీసీఏకే కేటాయించాలని వెంకటేశ్వర్ రెడ్డి కోరారు.