ఆశలే లేని స్థితిలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అల్లాడించడంతో ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం సాధించింది. రెండో వన్డేలో కరీబియన్లు కొండంత స్కోరు చేశామనుకుంటే.. దాన్ని అక్షర్ ఒంటిచేత్తో పిండి చేశాడు. శ్రేయస్, శాంసన్ హాఫ్ సెంచరీలతో గట్టి పునాది వేయగా.. ఆఖర్లో అక్షర్ ఎడాపెడా సిక్సర్లతో విండీస్ భరతం పట్టాడు. దీంతో టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేసింది.
విండీస్తో రెండో వన్డేలో భారత్ విజయంపోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (35 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విజృంభించడంతో వెస్టిండీస్తో రెండో వన్డేలో భారత్ గెలుపొందింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో టీమ్ఇండియా 2 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తుచేసి.. మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. షై హోప్ (115) శతక్కొట్టగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (74) రాణించాడు. భారత బౌలర్లలో శార్దూల్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 312 పరుగులు చేసింది. అక్షర్ పటేల్తో పాటు శ్రేయస్ అయ్యర్ (63; 4 ఫోర్లు, ఒక సిక్సర్), సంజూ శాంసన్ (54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
కెప్టెన్ శిఖర్ ధవన్ (13), సూర్యకుమార్ యాదవ్ (9) విఫలం కాగా.. శుభ్మన్ గిల్ (43), దీపక్ హుడా (33) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కైల్ మయేర్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.అక్షర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం నామమాత్రమైన మూడో వన్డే జరుగనుంది.
భారీ లక్ష్యఛేదనలో టీమ్ఇండియా తొలుత ఇబ్బంది పడింది. ధవన్, సూర్యకుమార్ తక్కువ స్కోరుకే ఔట్ కాగా.. గిల్ కాస్త పోరాడాడు. అయితే హాఫ్ సెంచరీలతో రాణించిన శ్రేయస్, సంజూ శాంసన్ వెంట వెంటనే ఔట్ కావడంతో ధవన్ సేన కష్టాల్లో పడింది.
చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేయాల్సి రాగా.. క్రీజులో దీపక్ హుడా తప్ప స్పెషలిస్ట్ బ్యాటర్ లేకపోవడంతో భారత్ విజయం కష్టమే అనిపించింది. ఈ దశలో అక్షర్ ఎడాపెడా సిక్సర్లతో విరుచుకుపడి లక్ష్యాన్ని కరిగించాడు. అకీల బౌలింగ్లో లెగ్సైడ్ సిక్సర్తో మోత మొదలు పెట్టిన అక్షర్ చివరి వరకు క్రీజులో నిలిచాడు.
మరీ దూకుడుకు పోకుండా.. మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులపై విరుచుకుపడ్డాడు. అచ్చం టాపార్డర్ బ్యాటర్ తరహాలో టెయిలెండర్లను కాచుకుంటూ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్లో తొలి అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు కావాల్సి ఉండగా.. నాలుగో బంతికి భారీ సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు.
1 ఒక జట్టుపై వరుసగా అత్యధిక దైపాక్షిక సిరీస్లు నెగ్గిన జట్టుగా టీమ్ఇండియా చరిత్రకెక్కింది. తాజా విజయంతో విండీస్పై భారత వరుస విజయాల సంఖ్య 12కు చేరింది. జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్లు నెగ్గిన పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది.
వెస్టిండీస్: 50 ఓవర్లలో 311/6 (హోప్ 115, పూరన్ 74; శార్దూల్ 3/54), భారత్: 49.4 ఓవర్లలో 312/8 (అక్షర్ 64*, శ్రేయస్ 63; జోసెఫ్ 2/46).