న్యూఢిల్లీ : ఆలిండియా ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) ప్రధాన కార్యదర్శి షాజి ప్రభాకరన్ను ఆ పదవినుంచి తొలగిస్తున్నట్టు సమాఖ్య అధ్యక్షుడు కళ్యాణ్ చౌబె ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభాకరన్ చర్యలు ఆమోదయోగ్యంగా లేవని, అవిశ్వాసం కారణంగా అతనిని తక్షణమే పదవినుంచి తొలగిస్తున్నట్టు, అతని స్థానంలో డిప్యూటీ కార్యదర్శి సత్యనారాయణ తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.
సమాఖ్య ఉపాధ్యక్షుడు హారిస్ కూడా ఈ చర్యను సమర్ధిస్తూ ప్రభాకరన్ పట్ల ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా సంతృప్తిగా లేదని తెలిపారు. కాగా తన ఉద్వాసనపై ప్రభాకరన్ స్పందిస్తూ ఇది తనపై జరిగిన కుట్రగా అభివర్ణిస్తూ, తనను తొలగించే అధికారం ఎగ్జిక్యూటివ్ కమిటీకి మాత్రమే ఉందన్నారు.