ముంబై: టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగార్కర్(Ajit Agarkar)ను నియమించే అవకాశాలు ఉన్నాయి. చేతన్ శర్మ రాజీనామా తర్వాత ఆ స్థానం ప్రస్తుతం ఖాళీ ఉంది. శివ శంకర్ దాస్ ప్రస్తుతం తాత్కాలిక చీఫ్ సెలెక్టర్గా చేస్తున్నారు. బీసీసీఐకి చెందిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ శుక్రవారం ముంబైలో భేటీ కానున్నది. ఆ భేటీలో అజిత్ అగార్కర్ను తదుపరి చీఫ్ సెలెక్టర్గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
చీఫ్ సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30వ తేదీ ఆఖరు. అయితే హై ప్రొఫైల్ ఉన్న ప్లేయర్ను సెలెక్టర్గా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిసత్ఉన్నారు. ఆ పాత్రకు అగార్కర్ ఫిట్ అవుతాడని భావిస్తున్నారు. 2007లో టీ20 వరల్డ్కప్ గెలిచిన జట్టులో అగార్కర్ ఉన్నాడు. 45 ఏళ్ల అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో అతను 58 వికెట్లు తీయగా, వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 42 మ్యాచ్లు ఆడి 29 వికెట్లు తీశాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్గా చేస్తున్నాడు.
వన్డేల్లో అతిత్వరగా 50 వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ బౌలర్గా అగార్కర్ పేరిట రికార్డు ఇంకా ఉంది. చివరిసారి కూడా చీఫ్ సెలెక్టర్ పదవి కోసం అగార్కర్ పోటీపడ్డారు. కానీ చేతన్ శర్మ చేతిలో అతను ఓడిపోయారు. ఇప్పుడు ఆ జాబ్కు అగార్కరే ముందు వరుసలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్కు చీఫ్ సెలెక్టర్ బాధ్యతల్ని అప్పగించేందుకు బీసీసీఐ ఆసక్తి ఉన్నా.. అతను మాత్రం ఆ ఇంట్రెస్ట్తో లేనట్లు తెలుస్తోంది.