ముగ్గురు ఆడపిల్లలే కావడంతో పోషణ భారమని భావించిన తల్లిదండ్రులు.. ఒకానొక దశలో చిన్న కూతురిని అమ్మేయాలనుకున్నారు!చివరి నిమిషంలో మనసు మార్చుకున్న తండ్రి.. రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేసిన ఆ అమ్మాయే నేడు జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించి తల్లిదండ్రులను గర్వపడేలా చేసింది!!
తండ్రి కల నెరవేర్చేందుకు వాలీబాల్ కోర్టులో అడుగుపెట్టిన మరో అమ్మాయి.. అంచలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమైంది స్ఫూర్తివంతమైన ఆ ఇద్దరమ్మాయిలే.. ఐశ్వర్య, శ్రీకృతి. ఇటీవల చెన్నై వేదికగా జరిగిన జాతీయ బీచ్ వాలీబాల్ చాంపియన్షిప్లో పసిడి కాంతులు విరజిమ్మిన.. ఈ యువ కెరటాలు వచ్చే నెలలో జరుగనున్న ఆసియా బీచ్ వాలీబాల్ చాంపియన్షిప్నకు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రయాణంపై ప్రత్యేక కథనం..
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం బొల్లెపల్లికి చెందిన ఐశ్వర్య.. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో మూడో అమ్మాయిని పెంచి పెద్ద చేయడం కష్టమని భావించిన ఆ తల్లిదండ్రులు (కవిత, సంజీవ).. పసి బిడ్డనే అమ్మేయాలని భావించినా.. చివరకు మనసు మార్చుకొని పెంచి పెద్ద చేశారు.
చిన్నప్పటి నుంచే ఆటల్లో చురుకైన ఐశ్వర్య.. పాఠశాలలో తన సీనియర్లు వాలీబాల్ ఆడుతుండటం గమనించి.. ఆటపై ఇష్టం పెంచుకుంది. పీఈటీ బ్రహ్మయ్య శిక్షణలో ఆటలో ఓనమాలు నేర్చుకున్న ఆమె. ఆ తర్వాత నిలకడగా రాణిస్తూ.. అంచెలంచెలుగా ఎదిగింది.
ప్రస్తుతం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ.. విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్లో కోచింగ్ తీసుకుంటున్న 17 ఏండ్ల ఐశ్వర్య.. ఇటీవల ముగిసిన జాతీయ బీచ్ వాలీబాల్ చాంపియన్షిప్లో స్వర్ణం కైవసం చేసుకుంది.
పదేండ్ల ప్రాయం నుంచి వాలీబాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఐశ్వర్య.. ఇప్పటి వరకు వేర్వేరు విభాగాల్లో తొమ్మిది సార్లు జాతీయ టోర్నీల్లో పాల్గొంది. స్వతహాగా అటాకింగ్ను ఇష్టపడే ఈ నల్లగొండ అమ్మాయికి.. సీనియర్ ప్లేయర్ శ్రీకృతి తోడవడంతో చెన్నై టోర్నీలో ఈ జోడీ దుమ్మురేపింది. తెలంగాణ తరఫున బీచ్ వాలీబాల్లో తొలి గోల్డ్ మెడల్ కొట్టిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. తద్వారా వచ్చే నెల థాయ్లాండ్ వేదికగా జరుగనున్న ఆసియా బీచ్ వాలీబాల్ చాంపియన్షిప్నకు అర్హత సాధించింది.
సాధారణ వాలీబాల్ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటే.. బీచ్ వాలీబాల్లో కోర్టు మొత్తం ఇద్దరే కవర్ చేయాల్సి ఉంటుంది. ఇసుకలో ఆడటం సవాలుతో కూడుకున్న విషయం. అందుకు తోడు ఓపెన్ ఎయిర్లో గాలి దిశను బట్టి మారే బంతి గమనాన్ని అంచనా వేయడం మరింత కష్టంతో కూడుకున్న పని.
జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని తండ్రి కన్న కలను.. శ్రీకృతి సాకారం చేసుకుంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తన తండ్రి.. జిల్లాస్థాయి వరకు వాలీబాల్ ఆడినా.. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల ఆటకు దూరం కావాల్సి వచ్చింది.
నాన్న అడుగుజాడల్లో నడుస్తున్న శ్రీకృతి.. వాలీబాల్లో సెట్టర్గా, సెంటర్గా రాణిస్తున్నది. కోచ్ వినోద్ శిక్షణలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన 20 ఏండ్ల శ్రీకృతి.. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 17 జాతీయ టోర్నీలు ఆడింది. సెయింట్ ఫ్రాన్సెస్ కళాశాలలో పీజీ చదువుతున్న శ్రీకృతి.. స్వతహాగా వాలీబాల్ ప్లేయర్ అయినా..
అనుకోని అవకాశం రావడంతో బీచ్ వాలీబాల్లో బరిలోకి దిగి సత్తాచాటింది. దేశానికి ఆడే చాన్స్ రావడం ఆనందంగా ఉందన్న ఈ హైదరాబాదీ.. చదువుతో పాటు కెరీర్ను ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేసింది. తెలంగాణ వాలీబాల్ సంఘం నుంచి చక్కటి సహకారం లభించడంతో పాటు..
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుండటంతో ఆటలను కెరీర్గా ఎంచుకోవాలనే భావన యువతలో పెరుగుతున్నదని శ్రీకృతి పేర్కొంది. నైసర్గీక పరిస్థితుల రిత్యా.. బీచ్ వాలీబాల్కు తెలంగాణ పరిస్థితులు అనుకూలించకపోయినా.. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచుకున్న వీరిద్దరూ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నారు.