2036 Olympics Bid: 2036లో జరుగబోయే ఒలింపిక్స్కు బిడ్ వేయాలని పట్టుదలతో ఉన్న భారత్.. ఆ దిశగా మరో కీలక అడుగు ముందుకేసింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల స్వరాష్ట్రం గుజరాత్ లో ఒలింపిక్స్ను నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అహ్మదాబాద్లో ఐదు భారీ స్టేడియాల నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం – గుజరాత్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లుతున్నట్టు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్లో ప్రధాని మోడీ… 2036 ఒలింపిక్ గేమ్స్తో పాటు 2030 యూత్ ఒలింపిక్స్కు కూడా బిడ్ వేస్తామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒలింపిక్స్ నిర్వహణ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సుమారు 50 నుంచి 65 దేశాలు పాల్గొనే కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకే గతేడాది బర్మింగ్హామ్ (ఇంగ్లండ్) వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. 2026లో ఈ గేమ్స్ను నిర్వహించేందుకు ఆస్ట్రేలియాలోని విక్టోరియానగరం ముందుకొచ్చినా తర్వాత ఖర్చు తడిసి మోపెడవుతుందని భావించి వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అలాంటిది ప్రపంచపటంలోని దేశాలన్నీ పాల్గొనే ఒలింపిక్స్ నిర్వహణకు ఖర్చు కామన్వెల్త్ కంటే ట్రిపుల్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లో మౌళిక సదుపాయాలతో పాటు ఒలింపిక్స్ ఆడేందుకు అనువైన స్టేడియాలు నిర్మించాలి. తాజాగా అహ్మదాబాద్ అదే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అహ్మదాబాద్లో ఇప్పటికే లక్షా 30 వేల మంది సీటింగ్ కెపాజిటీ కలిగిన క్రికెట్ (నరేంద్ర మోడీ స్టేడియం) స్టేడియం ఉంది. కానీ ఒలింపిక్స్లో వందలాది క్రీడాంశాలను నిర్వహించేందుకు గాను నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐదు భారీ స్టేడియాలను నిర్మించేందుకు ఇరు ప్రభుత్వాలు (కేంద్ర, రాష్ట్ర) ఇప్పటికే అంగీకారం తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 50వేల మంది సీటింగ్ కెపాజిటీతో ఫుట్బాల్ స్టేడియం, 18 వేలు, 10 వేల సీటింగ్ కెపాజిటీతో రెండు ఇండోర్ స్టేడియాలు, ఒక ఆక్వాటిక్ సెంటర్ (స్విమ్మింగ్ క్రీడల కోసం), పదివేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో టెన్నిస్ స్టేడియాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అడా) కూడా ఈ మేరకు టెండర్స్ ప్రక్రియను ప్రారంభించినట్టు సమాచారం. స్టేడియాలతో పాటు సబర్మతి రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి, సుందరీకరణ పనులు కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.