ఐర్లాండ్ క్రికెట్కు సుమారు 16 ఏండ్లుగా కర్త, కర్మ, క్రియలా ఉన్న దిగ్గజ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ విలియమ్ పోర్టర్ఫీల్డ్ సుదీర్ఘ ప్రయాణానికి గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకుంటున్నట్టు పోర్టర్ఫీల్డ్ శుక్రవారం ప్రకటించాడు. భారత జట్టు ఐర్లాండ్తో సిరీస్ ఆడడానికి సరిగ్గా పది రోజుల ముందు పోర్టర్ఫీల్డ్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ జట్టుకు భారీ షాకిచ్చింది.
2006 లో ఐర్లాండ్ జట్టులోకి వచ్చిన పోర్టర్ఫీల్డ్.. ఆ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో కలిసి 212 మ్యాచులు ఆడాడు. ఇందులో 172 మ్యాచులకు సారథిగా ఉన్నాడు. ఐర్లాండ్ ఆడిన రెండు వన్డే ప్రపంచకప్ (2011, 2015) లు, ఐదు టీ20 ప్రపంచకప్లలో అతడు సభ్యుడిగా ఉన్నాడు. అంతేగాక 2018 లో ఆ జట్టు తొలిసారి ఆడిన టెస్టు (పాకిస్తాన్తో) కు కూడా సారథిగా వ్యవహరించాడు.
పోర్టర్ఫీల్డ్ సారథ్యంలో ఐర్లాండ్ జట్టు పలు చిరస్మరణీయ విజయాలను అందుకుంది. 2008 లో అతడు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా.. 2009 లో ఐర్లాండ్ జట్టు టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించింది. 2011 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్పై ఐర్లాండ్ సంచలన విజయం ఎవరూ మరిచిపోలేనిది. 2019 వరకు అతడు ఐర్లాండ్కు సారథిగా కొనసాగాడు.
పోర్టర్ఫీల్డ్ అంతర్జాతీయ కెరీర్లో వన్డేలలో 30.58 సగటుతో 4343 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలున్నాయి. టీ20లలో 1,079 రన్స్ సాధించాడు. కాగా ఆటగాడిగా రిటైర్డ్ అయినా తాను ఇక నుంచి కోచ్ పాత్రలో మెరవనున్నట్టు స్పష్టం చేశాడు. ఇదిలాఉండగా భారత జట్టు ఈనెల 26, 28 లలో ఐర్లాండ్తో రెండు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే. భారత్తో సిరీస్కు ఆండ్రూ బల్బిర్నీ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
🎥: GREAT MEMORIES
As we say farewell to a legend of Irish cricket, let’s look back at some great memories of @purdy34 in action.#ThankYouPorty #BackingGreen ☘️🏏 pic.twitter.com/tUomTYQcgN
— Cricket Ireland (@cricketireland) June 16, 2022