IPL Media Rights | ఐపీఎల్ మీడియా హక్కుల (2023-27 కాలానికి) ద్వారా భారీగా ఆర్జించాలని భావిస్తున్న బీసీసీఐకి టెండర్ వేసిన సంస్థలు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తున్నాయి. శుక్రవారం నిర్వహించిన టెక్నికల్ బిడ్డింగ్ నుంచి ప్రముఖ రిటైల్ సంస్థ అమెజాన్ తప్పుకుని అందర్నీ ఆశ్చర్యపరచగా.. తాజాగా ప్రాథమిక బిడ్డింగ్ కు అర్హత సాధించిన ‘జీ నెట్వర్క్’ కూడా వేలం రేసు నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆదివారం నిర్వహించబోయే వేలం నుంచి జీ కూడా తప్పుకున్నట్టు సమాచారం. ప్యాకేజ్-ఏ లో పోటీ పడుతున్న జీ.. తాజాగా ఆ రేస్ నుంచి తప్పుకున్నది. జీ కూడా వైదొలగడంతో మీడియా హక్కుల బిడ్డింగ్ లో మూడే పెద్ద సంస్థలు మిగిలాయి. అవి.. రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్18, డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్.
శుక్రవారం నాటి టెక్నికల్ బెడ్డింగ్ లో జీ నెట్వర్క్ తమ బిడ్ ను సమర్పించినప్పటికీ వేలం ప్రక్రియలో మాత్రం పాల్గొనకపోవచ్చు. త్వరలోనే జీ-సోనీలు కలవబోతున్నాయి. వేలంలో పాల్గొంటే తమకే తాము పోటీనిచ్చినట్టు అవుతుందని ఇరు సంస్థల ప్రతినిధులు భావిస్తున్నారు. దీంతో ఈ రేసు నుంచి జీ తప్పుకున్నట్టు సమాచారం.
ఇదే విషయమై ఇరు సంస్థలతో సంబంధాలున్న ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ‘జీ బిడ్ లో పాల్గొనడం ఎందుకు..? ఆ సంస్థ త్వరలోనే సోనీతో కలవబోతున్నది. అలాంటప్పుడు వాళ్లతో వాళ్లకే పోటీ ఎందుకు కోరుకుంటారు..? జీ రేస్ లో లేనట్టే..’ అని తెలిపాడు. అమెజాన్, గూగుల్ తో పాటు జీ కూడా తప్పుకోవడంతో బీసీసీఐ ఆశించిన మొత్తం వస్తుందా..? లేదా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఇ-వేలం జరుగనుంది.
– డిస్నీ స్టార్ (ప్రస్తుత బీసీసీఐ అధికార ప్రసారదారు)
– రిలయన్స్ వయాకామ్ 18
– సోనీ నెట్వర్క్
– జీ ఎంటర్టైన్మెంట్
– టైమ్స్ నెట్వర్క్ (డిజిటల్ హక్కులు)
– రిలయన్స్ జిమో (డిజిటల్ హక్కులు)
– సూపర్ స్పోర్ట్ (ఉపఖండం ఆవల- ప్యాకేజ్ డి హక్కులు)