సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ.. మూడేండ్ల తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు సెంచరీతో కదంతొక్కిన వేళ టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. నిర్జీవమైన పిచ్పై ఆసీస్కు దీటుగా మనవాళ్లు దంచికొట్టగా.. రోహిత్ సేనను నిలువరించేందుకు కంగారూలు ఆపసోపాలు పడ్డారు. ఒక ఎండ్లో కోహ్లీ క్రీజులో పాతుకుపోగా.. తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ దుమ్ములేపారు.
గత మూడు టెస్టులకు భిన్నంగా సాగుతున్న ఈ పోరులో ఆఖరి రోజు ఎలాంటి హైడ్రామా చోటు చేసుకుంటుందనేది ఆసక్తికరం. పిచ్ స్పిన్కు అనుకూలిస్తున్న నేపథ్యంలో సోమవారం తొలి
సెషన్లో కంగారూలు మన స్పిన్ త్రయాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ప్రత్యర్థిని రెండు సెషన్ల లోపు ఆలౌట్ చేయగలిగితే టెస్టు సిరీస్తో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ ఖరారైనట్లే!
అహ్మదాబాద్: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అద్భుత క్షణం అహ్మదాబాద్లో ఆవిష్కృతమైంది. 2019 నవంబర్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో సెంచరీ చేయని విరాట్ కోహ్లీ (364 బంతుల్లో 186; 15 ఫోర్లు) ఎట్టకేలకు మూడంకెల స్కోరు అందుకున్నాడు. దీంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులు చేసింది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న వికెట్పై స్వేచ్ఛగా ఆడిన మాజీ కెప్టెన్ ఒక దశలో డబుల్ సెంచరీ చేసేలా కనిపించినా.. సహచరులు వెనుదిరుగుతుండటంతో భారీ షాట్కు యత్నించి ద్విశతకానికి 14 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (79; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడారు. వెన్ను నొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు రాకపోగా.. టీమ్ఇండియా పది మందితోనే ఇన్నింగ్స్ ముగించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్, టాడ్ మార్ఫి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆసీస్.. భారత స్కోరుకు ఇంకా 88 పరుగులు వెనుకబడి ఉంది. నేడు ఆటకు ఆఖరి రోజు.
ఓవర్నైట్ స్కోరు 289/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా.. ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. కోహ్లీ పూర్తి నియంత్రణతో షాట్లు ఆడగా.. మార్ఫి బౌలింగ్లో జడేజా ఔటయ్యాడు. అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ఆరో స్థానంలో భరత్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2019లో బంగ్లాదేశ్పై డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ చేసిన అనంతరం టెస్టు ఫార్మాట్లో విరాట్ మూడంకెల స్కోరు చేయడం ఇదే తొలిసారి. దీంతో మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ 75వ శతకం తన పేరిట లిఖించుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వంద శతకాలతో టాప్లో ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడిన భరత్ ఉన్నంతసేపు వేగంగా ఆడగా.. అక్షర్ పటేల్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. అప్పటికే క్రీజులో గంటల తరబడి సమయం గడిపిన కోహ్లీ.. కంగారూ బౌలర్ల సహనాన్ని పరీక్షించగా.. మరో ఎండ్ నుంచి వీలుచిక్కినప్పుడల్లా అక్షర్ భారీ షాట్లు ఆడాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆరోవికెట్కు వీరిద్దరూ కలిసి 215 బంతుల్లోనే 162 పరుగులు జోడించడం విశేషం. అయితే అక్షర్ను క్లీన్బౌల్డ్ చేయడం ద్వారా స్టార్క్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా.. ఆ తర్వాత అశ్విన్ (7), ఉమేశ్ యాదవ్ (0) వెంటవెంటనే ఔటయ్యారు. భారీ షాట్కు యత్నించిన విరాట్.. బౌండ్రీ సమీపంలో లబుషేన్ పట్టిన క్యాచ్కు పెవిలియన్ బాటపట్టాడు. ఫలితంగా రోహిత్ సేనకు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఇటీవలి కాలంలో ఆఫ్స్టంప్ ఆవల పడ్డ బంతులకు పదే పదే వికెట్ సమర్పించుకుంటున్న కోహ్లీ.. ఈ మ్యాచ్లో కొత్తగా కనిపించాడు. ఆఫ్స్టంప్ లైన్లో బ్యాటింగ్ చేస్తూ.. దూరంగా వెళ్తున్న బంతులను వదిలేశాడు. గత మ్యాచ్లతో పోల్చుకుంటే పరిణతి చెందిన ఇన్నింగ్స్తో ఆలరించాడు. ఏమాత్రం తొందరపడకుండా ముందుకు సాగిన కోహ్లీ.. శతకం సాధించేందుకు 241 బంతులు తీసుకున్నాడు. మామూలుగా అయితే విరాట్ రేంజ్కు ఇవి చాలా ఎక్కువ బంతులే అయినా.. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన మాజీ కెప్టెన్ ఒక్కసారి శతకం పూర్తైన తర్వాత గేర్లు మార్చాడు. సెంచరీ అనంతరం విరాట్ తన మెడలో ఉన్న ప్రత్యేకమైన లాకెట్ను ముద్దాడుతూ సంబురాలు జరుపుకున్నాడు. అప్పటి వరకు బౌండ్రీలు బాదేందుకు ఎక్కువ ప్రయత్నించని విరాట్.. సెంచరీ తర్వాత ధాటిగా బ్యాటింగ్ చేశాడు. పదే పదే బంతిని గీత దాటిస్తూ స్ట్రయిక్రేట్ పెంచాడు. ఈ క్రమంలో కోహ్లీ బ్యాట్ నుంచి అత్యుత్తమ కవర్ డ్రైవ్లు, ఆఫ్ డ్రైవ్లు దర్శనమిచ్చాయి. పూర్తి క్రమశిక్షణతో కూడిన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. 84 సింగిల్స్, 18 డబుల్స్ తీశాడు. రెండుసార్లు మూడేసి పరుగులు రాబట్టాడు.
తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగలేకపోయిన శ్రేయస్ అయ్యర్ విషయంలో భారత జట్టు మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయ్యర్ గాయంపై స్పష్టత లేకుండానే అతడిని మ్యాచ్ ఆడించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తొలి రెండు రోజులు ఫీల్డింగ్ చేసిన అయ్యర్ ఆదివారం బ్యాటింగ్ సమయానికి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్కు పంపినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు శ్రేయస్ అందుబాటులో ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ రాణించడం సరిపోయింది కానీ, తొలి ఇన్నింగ్స్లో మనవాళ్లు భారీ స్కోరు చేయకపోయుంటే ఇది పెద్ద అంశంగా పరిణమించేదే!
బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా జరిగిన గత మూడు టెస్టులకు భిన్నంగా తాజా మ్యాచ్ సాగుతున్నది. చివరి మూడు టెస్టులు మూడురోజుల్లోనే ముగియగా.. అహ్మదాబాద్ మ్యాచ్లో మాత్రం నాలుగోరోజు ఆట పూర్తైనా ఫలితం ఎటు మొగ్గుచూపుతుందో అర్థం కావడం లేదు. సంప్రదాయ భారత పిచ్ల స్వభావాన్ని బట్టి చూస్తే.. ఆఖరి రోజు బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదు. సోమవారం తొలి సెషన్లో భారత బౌలర్లను కంగారూలు ఎలా ఎదుర్కుంటారనేది కీలకం. తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ బాదిన ఉస్మాన్ ఖవాజా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేదు. స్మిత్, లబుషేన్, హేడ్, గ్రీన్ను త్వరగా పెవిలియన్ చేర్చగలిగితే.. టీమ్ఇండియాకు తిరుగులేనట్లే. ఇప్పటికే 88 పరుగుల లోటులో ఉన్న కంగారూలు రెండొందల పరుగులు చేసినా.. రోహిత్ సేన టార్గెట్ ఛేదించి విజయం సాధించే అవకాశం ఉంటుంది. లేక నిర్జీవమైన పిచ్పై కంగారూలు చివరి రోజు కుదురుకొని బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమే. ఇతర జట్ల జయాపజయాలతో సంబంధం లేకుండా టీమ్ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మనవాళ్లు దూకుడుగా బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారీ సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. అనారోగ్యంతోనే ఆణిముత్యంలాంటి ఇన్నింగ్స్ ఆడాడని అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పేర్కొంది. తాజా పోరులో 8 గంటలా 36 నిమిషాల పాటు క్రీజులో గడిపిన కోహ్లీ.. అస్వస్థతతోనే 364 బంతులు ఎదుర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అనుష్క వెల్లడించింది. కొద్దిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్న కోహ్లీ.. ఔటై వెళ్తున్న సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహా ఆటగాళ్లంతా అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం అభిమానులను కట్టిపడేసింది.
మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీకిది 75వ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్లో ఇది రెండో అత్యధికం. సచిన్ టెండూల్కర్ (100) టాప్లో ఉన్నాడు.
ఒకవైపు అభిమానులంతా భారత్ విజయ తీరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్న సమయంలో అహ్మదాబాద్లో కొందరు ఆకతాయిలు.. తమ చర్యలతో భారత ప్లేయర్లను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేశారు. మ్యాచ్ విరామ సమయంలో టీమ్ఇండియా ఆటగాళ్లంతా డగౌట్ సమీపంలో నిల్చున్న సమయంలో స్టాండ్స్లో నుంచి కొందరు ప్రేక్షకులు.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అని అరుస్తూ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇక్కడి వరకు ఓకే కానీ.. ఆ తర్వాతే కొందరు అభిమానులు కావాలనే సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేరు పిలుస్తూ.. ‘జై శ్రీరామ్’అనే నినాదాలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 480, భారత్ తొలి ఇన్నింగ్స్: 571 (కోహ్లీ 186, గిల్ 128; మార్ఫి 3/113, లియాన్ 3/151), ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 6 ఓవర్లలో 3/ఏ (హేడ్ 3 నాటౌట్, కునేమన్ 0 నాటౌట్).