గోల్ఫ్లో అంచనాల్లేకుండా బరిలోకి దిగి ఒక్కో రౌండ్ను అధిగమిస్తూ ప్రపంచ ర్యాంకు ప్లేయర్లకు షాకులిచ్చిన భారత క్రీడాకారిణి అదితి అశోక్ తృటిలో పతకం చేజార్చుకుంది. వర్షం, తుఫాను హెచ్చరికలతో ఆట సాగుతుందా..? లేదా..? అనుకున్న మ్యాచ్లో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. వర్షం పడి ఉంటే మూడో రౌండ్ ఫలితంతో ఆమె కనీసం రజత పతకమైనా సాధించేది. ఫలితాన్ని తేల్చే చివరిదైన నాలుగో రౌండ్లో ఈ కర్ణాటక అమ్మాయి ఐదు బర్డీస్ సాధించింది. 5, 6, 8, 13, 14 హోల్స్ను నిర్ణీత స్ట్రోక్స్ కంటే ముందే పూర్తి చేసినా.. 9, 11 వ హోల్స్కు మాత్రం బోగీస్ ఎదురయ్యాయి. శనివారం మ్యాచ్లో యూఎస్కు చెందిన నెల్లీ కోర్డా పసిడి పతకం గెలువగా జపాన్ క్రీడాకారిణి మోన్ ఇనామి రజత పతకం నెగ్గింది.