న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ ఉన్నతి హుడా కొత్త చరిత్ర లిఖించింది. ఆసియా జూనియర్ చాంపియన్షిప్ సింగిల్స్లో ఫైనల్ చేరిన తొలి భారత షట్లర్గా ఉన్నతి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. శనివారం జరిగిన బాలికల అండర్-17 సెమీస్లో ఉన్నతి 21-8, 21-17తో మోన్ యోకౌచి(జపాన్)పై అలవోక విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటి వరకు ఒక గేమ్ కోల్పోని ఉన్నతి..సెమీస్లోనూ అదే పంథా కొనసాగించింది. ప్రత్యర్థి జపాన్ షట్లర్కు ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస గేముల్లో చిత్తు చేసి తుదిపోరులోకి దూసుకెళ్లింది.
పదునైన స్మాష్లకు తోడు నెట్గేమ్తో జపాన్ షట్లర్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఉన్నతి..ఆదివారం జరిగే ఫైనల్లో థాయ్లాండ్కు చెందిన సరున్రాక్ వితిద్శర్న్ను ఢీకొంటుంది. మరోవైపు బాలుర అండర్-15 విభాగంలో రాష్ట్ర యువ షట్లర్ జ్ఞాన దత్తుకు కాంస్యం దక్కింది. సెమీస్లో దత్తు 16-21, 21-19, 13-21 స్కోరుతో చాంగ్ ఇసాంగ్ యిహి(చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. మరో సెమీస్లో అనిష్ తోపాని 18-21, 21-12, 21-12తో రెండో సీడ్ లీ యు జుయి(చైనీస్ తైపీ)పై నెగ్గి చాంగ్ ఇసాంగ్తో స్వర్ణ పోరుకు సిద్ధమయ్యాడు. భారత జోడీ అర్ష్ మొహమ్మద్-సంస్కార్ సరస్వత్ జోడీ ఫైనల్స్కు చేరుకుంది.