న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరింత ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. వచ్చే సీజన్ నుంచి 8 జట్లు కాస్త పదికి, మ్యాచ్ల సంఖ్య 74కు చేరుతుండడంతో ఐపీఎల్పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ ఐపీఎల్ ప్రసార హక్కుల (టీవీ, డిజిటల్) ధర ఊహించని రీతిలో పెరిగే అవకాశం కనిపిస్తున్నది. వచ్చే ఐదేండ్ల కాల పరిమితి (2023-27)కి ప్రసార హక్కుల ధర ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. గత ఐదేండ్ల కాలానికి స్టార్ ఇండియా సంస్థ రూ.16వేల కోట్లకు బిడ్డింగ్గను దక్కించుకోగా, తాజాగా ఇది రెట్టింపు కానుంది. ఈ క్రమంలో ఐపీఎల్కు అభిమానుల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. స్టార్ ఇండియా, సోనీ స్పోర్ట్స్తో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ బిడ్డింగ్లో పోటీపడేందుకు బీసీసీఐని సంప్రదించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే ఈనెల 25న దుబాయ్లో బోర్డు రెండు కొత్త జట్ల పేర్లను ప్రకటించనుంది. కొత్త ఫ్రాంచైజీల ద్వారా రూ.3వేల కోట్లకు పైగా బోర్డు ఆర్జించే అవకాశముంది. మరోవైపు ప్రముఖ క్రికెటర్ ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు అమితాసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట పండనుంది.