ఫుట్బాల్ అభిమానులు కండ్లు కాయలు గాచేలా ఎదురుచూసే ప్రపంచకప్కు వేళయింది. ఖతార్ రాజధాని దోహాలో నెల రోజుల పాటు సాగే ఈ క్రీడా సంబరంలో టైటిల్ కోసం 32 జట్లు తలపడుతున్నాయి. పలు వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో ఖతార్.. ఈ మెగాటోర్నీని సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ల మధ్య మ్యాచ్లో ఈ క్రీడా సంగ్రామానికి తెర లేవనున్నది. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించి డిసెంబర్ 7వ తేదీవరకు లీగ్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహిస్తారు. డిసెంబర్ 9, 10, 11 తేదీలలో క్వార్టర్ఫైనల్స్, 14, 15 తేదీలలో సెమీఫైనల్స్, 17న మూడో స్థానం కోసం మ్యాచ్, 18వ తేదీన ఫైనల్స్ నిర్వహించనున్నారు.
దోహా: ఫిఫా ప్రపంచకప్ ప్రత్యేక ఏమిటంటే మ్యాచ్లు నిర్వహించే స్టేడియాలన్నీ ఒకే నగరంలో ఒక గంట ప్రయాణ దూరంలో ఉండడం. దీనితో ప్రత్యక్షంగా వీక్షించే ప్రేక్షకులు ఒకే రోజు రెండు మ్యాచ్లు చూసేందుకు అవకాశం ఉండడం. మ్యాచ్లు నిర్వహించేందుకు ఖతార్ మొత్తం 8 స్టేడియాలను సిద్ధం చేసింది. ఒక్కో స్టేడియం అత్యధికంగా 80వేలు, అత్యల్పంగా 40వేల సామర్థాన్ని కలిగి ఉన్నాయి. తొలి మ్యాచ్కు 60వేల కెపాసిటీ ఉన్న అల్బయత్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా, 80వేల సామర్థ్యమున్న లుసైల్ స్టేడియంలో ఫైనల్ జరుగనున్నది. మొత్తం 64 మ్యాచ్లు నెల రోజుల పాటు అభిమానులకు ఆనందం పంచనున్నాయి. ఆరు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 ఆరంభం కానుండగా తతిమావి రాత్రి 6.30 తరువాతే జరుగుతాయి. ప్రారంభ మ్యాచ్ రాత్రి 9.30కు ఖతార్, ఈక్వెడార్ల మధ్య జరుగనుంది.
ప్రారంభోత్సవ వేడుకలు రాత్రి 7.30కు ప్రారంభం కానుండగా, ఇందులో పలు దేశాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అధికారికంగా ఎవరు పాల్గొంటున్నదీ వెల్లడించకున్నా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సింగర్ జంగ్కూక్, రాబీ విలియమ్స్, భారత్కు చెందిన నోరా ఫతే, బ్లాక్ ఐడ్ పీస్ బృందం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. బ్రిటిష్ సింగర్ దువా లిపా, స్పెయిన్ సింగర్ షకీరా, సింగర్ రాడ్ స్టీవర్ట్లను ఆహ్వానించినా వారు వ్యక్తిగత కారణాలతో రాలేమని తెలిపినట్టు సమాచారం.
ఆతిథ్య జట్టుగా ప్రపంచకప్లో ఆడే అవకాశం దక్కించుకున్న ఖతార్ తొలి మ్యాచ్లో దక్షిణ అమెరికాకు చెందిన ఈక్వెడార్తో తలపడనుంది. ఖతార్ ఎన్నడూ ప్రపంచకప్ ఫైనల్స్కు క్వాలిఫై కాలేదు. ఈ విశ్వ సంబరంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఫుట్బాల్ ప్రపంచంలో 2019 ఆసియా కప్ గెలవడమే ఖతార్ అత్యుత్తమ ఘనత. ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా 2010లో గ్రూపు స్థాయిని దాటని స్థితిని ఖతార్ అధిగమించాలని ప్రయత్నిస్తున్నది. అందుకు ఈక్వెడార్తో తొలి మ్యాచ్ను వేదికగా చేసుకుని విజయాలు సాధించాలని ఆశిస్తున్నది.
ఈ గ్రూపులో సెనెగల్, నెదర్లాండ్స్ మిగతా జట్లు. తనకంటే ర్యాంకింగ్లో కేవలం అయిదు స్థానాలు ముందున్న ఈక్వెడార్పై గెలిచి శుభారంభం చేయాలని ఖతార్ ఆశిస్తున్నది. కాగా టోర్నీలో జట్ల పరంగా బ్రెజిల్, అర్జెంటీనా జట్లపైనే అందరి దృష్టి. ఆటగాళ్లలో లియోనల్ మెస్సీ, క్రిస్టియన్ రొనాల్డో మంత్రముగ్ధ ఆటను తిలకించేందుకు అభిమానులు టీవీలకు అతుక్కుపోతారనడం అతిశయోక్తి కాదు. అత్యంత ఆదరణ కలిగిన ఫుట్బాల్ ప్రపంచకప్ జరిగినన్నాళ్లూ అభిమానులకు పండగే.వివిధ క్వాలిఫయింగ్ పోటీ అనంతరం ఆతిథ్య ఖతార్తో పాటు 32 జట్లు ఫైనల్స్కు అర్హత సాధించాయి.
ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు గ్రూపు పోటీలు జరుగుతాయి. గ్రూపు మ్యాచ్లలో ప్రతి విజయానికి మూడు పాయింట్లు, డ్రాకు ఒక పాయింట్ లభిస్తుంది. డిసెంబర్ 3నుంచి రౌండ్-16 పోటీలు, 9 నుంచి క్వార్టర్స్ 14, 15 తేదీలలో సెమీఫైనల్స్, 17న మూడో స్థానం కోసం పోటీలు జరుగుతాయి. డిసెంబర్ 18న విజేత ఎవరన్నది తేలనుంది.
గ్రూపు ‘ఎ’
ఖతార్, ఈక్వెడార్,
సెనెగల్, నెదర్లాండ్స్
గ్రూపు ‘బి’
ఇంగ్లండ్, ఇరాన్,
అమెరికా, వేల్స్
గ్రూపు ‘సి’
అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలండ్
గ్రూపు ‘డి’
ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీసియా
గ్రూపు ‘ఇ’
స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్
గ్రూపు ‘ఎఫ్’
బెల్జియం, కెనడా,
మొరాకొ, క్రొయేషియా
గ్రూపు ‘జి’
బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్
గ్రూపు ‘హెచ్’
పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా