లండన్: కామన్వెల్త్ క్రీడా సంబురాలకు మరోసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. ఆ దేశంలోని విక్టోరియా రాష్ట్రంలో 2026 మార్చిలో క్రీడోత్సవాలు నిర్వహించాలని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) మంగళవారం నిర్ణయించింది. గతంలో మాదిరి ఒకే నగరానికి పరిమితం కాకుండా వివిధ నగరాల్లో క్రీడలు నిర్వహిస్తామని ప్రకటించింది. మెల్బోర్న్, గీలాంగ్, బెండిగో, బల్లారట్, గిప్స్లాండ్ నగరాల్లో పోటీలు జరుగనున్నాయి. టోర్నీ ప్రారంభోత్సవం ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో అట్టహాసంగా జరుగనుంది. మొత్తం 16 క్రీడల పోటీలు ఉండనుండగా.. వాటిలో టీ20 క్రికెట్ టోర్నీకి స్థానం దక్కింది. అయితే ప్రాథమికంగా రూపొందించిన జాబితాలో షూటింగ్, రెజ్లింగ్తో పాటు ఆర్చరీకి స్థానం లభించలేదు. చివరిసారి 2018లో గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఎనిమిదేండ్ల తర్వాత మరోసారి కంగారూల గడ్డపై జరుగనున్నాయి.