Formula-E race | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ రేసింగ్… అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చిన ఈ ఈవెంట్ ఇప్పుడు నగరానికి దూరం కానుందా? కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అహర్నిశలు శ్రమించి, ఒప్పించి రేసింగ్కు హైదరాబాద్ను వేదికగా మలిచిన శ్రమంతా వృథా అవుతుందా? ఫార్ములా-ఈ రేస్ ప్రతినిధులు గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటన చూస్తే ఇవి నిజమేనని స్పష్టమవుతుంది. 150 ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా వీక్షించిన ఈ-రేస్ను కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించగా… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆ స్థాయి అంకితభావం కనిపించకపోవడంతోనే క్యాలెండర్ నుంచి హైదరాబాద్ ఈ-ప్రిక్స్ను తొలిగించేందుకు వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం ‘వచ్చే ఏడాది ఈ-ప్రిక్స్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు’ అని ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. దీంతో టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్తో పాటు ఈ- రేస్ ప్రపంచ చాంపియన్షిప్నకు ఆతిథ్యాన్ని ఇచ్చే అద్భుతమైన అవకాశాన్ని హైదరాబాద్ నగరం చేజార్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో వందల కోట్లల్లో రావాల్సిన ఆదాయాన్ని కూడా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కోల్పోయిందనేది కూడా సుస్పష్టం.
ఒలింపిక్స్… క్రికెట్ పోటీలు… ఇలా అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా నగరాలు పోటీ పడతాయి. నిర్వాహకులను ఒప్పించి… వారిని మెప్పించి… తమ నగరాలను వేదికగా మలిచేందుకు అనేక దేశాల్లోని నగరాలు నెలలు, సంవత్సరాలు శ్రమిస్తాయి. ఇలా నిర్వాహకులు సంతృప్తి చెందితేనే ఆయా పోటీలకు ఆతిథ్యం కల్పించేందుకు నగరాలకు అనుమతినిస్తాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫార్ములా-ఈ రేస్ను విజయవంతంగా నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల కోసం పకడ్బందీగా ఆతిథ్యాన్ని కల్పించింది. హుస్సేన్సాగర్ తీరంలో జరిగిన ఈ పోటీలను ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు ప్రత్యక్షంగా వీక్షించాయి. సచిన్ టెండూల్కర్ సహా అంతర్జాతీయ క్రీడా, పారిశ్రామిక, సినీ అనేక రంగ ప్రముఖులు నగరానికి క్యూ కట్టారు. 31వేల మంది ప్రతినిధులు పోటీలను చూసేందుకు రాగా… అందులో 51 శాతం మంది ఇతర నగరాలు, దేశాల నుంచి వచ్చిన వారే ఉండటం విశేషం. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఈ పోటీలను విజయవంతం చేయడంతో అంతర్జాతీయంగా హైదరాబాద్ పేరు మారుమోగింది. దేశంలోని మరే ఇతర మెట్రో నగరాలకు దక్కని అవకాశాన్ని కేసీఆర్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంది. దీంతో ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు సుమారు 700 కోట్లు (83.7 మిలియన్ డాలర్లు) మేర ప్రయోజనం చేకూరినట్లు నీల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్ తన ఆర్థిక అధ్యయన నివేదికలో వెల్లడించింది.
వాస్తవానికి నాలుగు సంవత్సరాలు హైదరాబాద్లో పోటీలను నిర్వహించేందుకు అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వంతో పార్ములా-ఈ ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీన్కో నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో ఫార్ములా-ఈ రేస్ విజయవంతం అయిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి పదో తేదీన మరోసారి నిర్వహణకు నిర్ణయించారు. ఈ మేరకు క్యాలెండర్లో హైదరాబాద్ ఈ-ప్రిక్స్ను చేర్చారు. ఈ నేపథ్యంలో రేసు నిర్వహణ సాధ్యం కాదంటూ గురువారం ప్రతినిధులు ప్రకటన విడుదల సంచలనం రేపింది. ‘వచ్చే ఫిబ్రవరి 10న హైదరాబాద్లో ఈ-రేస్ నిర్వహించేందుకుగాను ఈ ఏడాది అక్టోబరు 30న కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహణకు సంబంధించి ప్రక్రియల్ని ముందుకు తీసుకుపోయేందుకు మా సీనియర్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. పలు దఫాలుగా సంప్రదించిన తర్వాత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒక లేఖ వచ్చింది. నిర్వహణపై గత ప్రభుత్వంతో జరిగిన ఒప్పంద వివరాలు ఏమిటి? నిర్వహణ వల్ల హైదరాబాద్కు కలిగే ప్రయోజనం ఏంది? అని ఆ లేఖలో ప్రభుత్వం మమ్మల్ని వివరాలు కోరింది. ఆ లేఖను పరిశీలిస్తే… హైదరాబాద్ ఈ-ప్రిక్స్ నిర్వహణపై ప్రణాళిక ప్రకారంగా ముందుకుపోవడం సాధ్యం కాదని అర్థమవుతుంది. నిర్వహణకు మరికొన్ని వారాల సమయమే ఉండటం, ఇప్పటికే భాగస్వాములు, సరఫరాదారులు భారీస్థాయిలో ఆర్థిక పెట్టుబడులు కూడా పెట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన ఈవెంట్కు అప్పటి ప్రభుత్వం వెచ్చించిన దాని కంటే అనేక రెట్ల పెరుగుదలతో హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు 84 మిలియన్ డాలర్ల ప్రయోజనం చేకూరింది. పోటీల నిర్వహణకు గతంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం’ అని ఫార్ములా-ఈ ప్రతినిధులు పేర్కొన్నారు.
సతీష్రెడ్డి, తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ ఫార్ములా-ఈ రేస్ ప్రపంచ చాంపియన్షిప్ నిర్వహించడమంటే ఆషామాషీ విషయం కాదు. ఒక నగరాన్ని అందుకు వేదికగా మలచాలంటే సంబంధిత ప్రభుత్వం నిర్వాహకులకు నమ్మకం కల్పించాలి. కేసీఆర్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫార్ములా-ఈ రేస్ను విజయవంతంగా నిర్వహించింది. దాని వెనక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కృషి ఎంతో ఉంది. కించిత్తు లోపం లేకుండా ఏర్పాట్లు కల్పిస్తామని వారిలో భరోసా కల్పించడంతో పాటు హైదరాబాద్ నగరానికి ఆ స్థాయి హంగులు ఉన్నాయనే విశ్వాసాన్ని ప్రోది చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలతో సంప్రదించినపుడు పరిశీలించిన అంశాలు… ముఖ్యంగా ఫార్ములా-ఈ నిర్వహణతో తెలంగాణకు కలిగే ప్రయోజనం ఏమిటి? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయడం నిర్వాహకుల్లో ఆందోళన కలిగించింది.