కోల్కతా: ప్రతిష్ఠాత్మక డ్యూరాండ్ కప్ టోర్నమెంట్కు వేళయైంది. కోల్కతా వేదికగా జరిగే ఈ టోర్నీని సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్నారు. ఈసారి టోర్నీలో ఐదు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫ్రాంచైజీలు, మూడు ఐ-లీగ్ టీమ్లతో పాటు మొత్తం 16 జట్లు బరిలోకి దిగనున్నాయి. సాధారణంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించే ఈ టోర్నీకి ఈసారి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా మద్దతునిస్తున్నది. టాప్ ఇండియన్ సూపర్ లీగ్స్ ఫ్రాంచైజీలైన ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) గోవా, బెంగళూరు ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్, జంషెడ్పూర్ ఎఫ్సీ, హైదరాబాద్ ఎఫ్సీ ఈసారి సత్తా చాటాలని చూస్తున్నాయి. వీటితో పాటు మొహమ్మదీన్ క్లబ్, గోకులమ్ కేరళ, సుదేవా ఎఫ్సీ, ఎఫ్సీ బెంగళూరు యునైటెడ్, ఢిల్లీ ఎఫ్సీ, ఇండియన్ ఆర్మీకి చెందిన రెండు జట్లు (రెడ్ అండ్ గ్రీన్), భారత వాయుసేన, నౌకాదళం, సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ కూడా బరిలోకి దిగనున్నాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన డ్యూరాండ్ కప్లో ఇది 130వ ఎడిషన్ కావడం గమనార్హం.