స్పిన్నర్ల కట్టడికి.. ఓపెనర్ల కొట్టుడు తోడవడంతో.. టీమ్ఇండియా సిరీస్ పట్టేసింది. టీ20 ప్రపంచకప్లో నిరాశాజనక ప్రదర్శనతో నీరసించిన అభిమానుల్లో రోహిత్ సేన తిరిగి జోష్ నింపింది. వరుసగా రెండో మ్యాచ్లో టాస్ నెగ్గిన రోహిత్ శర్మ.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించడంతోనే సగం మ్యాచ్ నెగ్గేసిన భారత్.. మిగిలిన పని సాఫీగా పూర్తి చేసింది. పవర్ ప్లే లో దంచికొట్టిన కివీస్ ఓపెనర్లు.. ఇన్నింగ్స్ ఆసాంతం అదే జోరు కొనసాగించలే
కపోగా.. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్ గ్యాంగ్.. కుదురుకున్నాక కివీస్పై విరుచుకుపడి ట్రోఫీ కైవసం చేసుకుంది!
రాంచీ: పొట్టి ప్రపంచకప్లో పెద్దగా ప్రభావం చూపలేక లీగ్ దశలోనే వెనుదిరిగిన టీమ్ఇండియా.. ఆ పరాభవం నుంచి త్వరగానే కోలుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (15 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ (31), చాప్మన్ (21), ఫిలిప్స్ (34) తలా కొన్ని పరుగులు చేశారు. టాపార్డర్ బ్యాటర్లకు మెరుగైన ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. 5 ఓవర్లలోనే 56 పరుగులు చేసిన కివీస్.. స్పిన్నర్ల రంగప్రవేశంతో చివరికి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ హర్షల్ పటేల్ రెండు, భువనేశ్వర్, దీపక్ చాహర్, అక్షర్, అశ్విన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (49 బంతుల్లో 65; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 55; ఒక ఫోర్, 5 సిక్సర్లు) దంచికొట్టడంతో భారత్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. రోహిత్, రాహుల్ తొలి వికెట్కు 117 పరుగులు జోడించి విజయానికి బాటలు వేయగా.. వెంకటేశ్ అయ్యర్ (12 నాటౌట్; 2 ఫోర్లు), రిషబ్ పంత్ (12 నాటౌట్; 2 సిక్సర్లు) మిగిలిన పనిపూర్తి చేశారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3 వికెట్లు పడగొట్టాడు. భారత స్పిన్నర్లు బంతిని గింగిరాలు తిప్పిన చోట.. కివీస్ బౌలర్లు పట్టు చిక్కక నానా అవస్థలు పడ్డారు. హర్షల్ పటేల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టీ20 ఆదివారం కోల్కతాలో జరుగనుంది.
ఐపీఎల్ 14వ సీజన్లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన హర్షల్ పటేల్.. టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. సిరాజ్ గాయపడటంతో రెండో టీ20లో చోటు దక్కించుకున్న హర్షల్కు.. శుక్రవారం మాజీ పేసర్ అజిత్ అగార్కర్ భారత క్యాప్ అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటిన హర్షల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలువడం విశేషం.
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 153/6 (ఫిలిప్స్ 34, గప్టిల్ 31; హర్షల్ 2/25), భారత్: 17.2 ఓవర్లలో 155/3 (రాహుల్ 65, రోహిత్ 55; సౌథీ 3/16).