భువనేశ్వర్: సొంతగడ్డపై భారత యువ హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది. ఎలాగైనా టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన భారత్..తమ పోరాటాన్ని ముగించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టీమ్ఇండియా 2-4 తేడాతో ఆరు సార్లు చాంపియన్ జర్మనీ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్లో ఆది నుంచి తమదైన దూకుడు కనబరిచిన జర్మనీ జట్టులో ఎరిక్(15ని), ఫిలిప్(21ని), హన్నెస్ ముల్లర్(24ని), క్రిస్టోఫర్(25ని) గోల్స్ చేశారు. తుదికంటా పోరాడిన భారత్ తరఫున ఉత్తమ్సింగ్(25ని), ధామిబాబీ(60ని) గోల్స్ కొట్టారు. ఆదివారం జరిగే మూడు, నాలుగు స్థానాల వర్గీకరణ మ్యాచ్లో ఫ్రాన్స్తో భారత్ తలపడనుండగా, జర్మనీ, అర్జెంటీనా మధ్య టైటిల్ పోరు జరుగనుంది. మ్యాచ్ విషయానికొస్తే బెల్జియంతో క్వార్టర్స్లో అదరగొట్టిన భారత్..జర్మనీపై తేలిపోయింది. డిఫెండర్లు, మిడ్ఫీల్డర్ల మధ్య సమన్వయ లోపం జర్మనీకి కలిసొచ్చింది. తొలి క్వార్టర్ మరి కొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా ఎరిక్ గోల్తో జర్మనీ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. టీమ్ఇండియాపై అంతకంతకు ఒత్తిడి పెంచుకుంటూ పోయిన జర్మనీ పది నిమిషాల వ్యవధిలో మరో మూడు గోల్స్ కొట్టి పోటీని ఏకపక్షం చేసింది. 25వ నిమిషంలో ఉత్తమ్సింగ్ గోల్తో ఖాతా తెరిచిన భారత్..ఆఖర్లో మరో గోల్తో పరువు కాపాడుకుంది.