ముంబై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ అలీసా హీలీ (58; 7 ఫోర్లు, ఒక సిక్సర్), తహిలా మెక్గ్రాత్ (50; 9 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు.
ముంబై బౌలర్లలో సైకా ఇషాఖ్ 3, అమేలియా కెర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 17.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో అదరగొట్టగా.. స్కీవర్ బ్రంట్ (45; 6 ఫోర్లు, ఒక సిక్సర్), యస్తిక భాటియా (42; 8 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. స్వల్ప లక్ష్యఛేదనలో ముంబై ఆరంభం నుంచే దంచికొట్టింది. బౌలర్తో సంబంధం లేకుండా రెచ్చిపోవడంతో పరుగుల వరద పారింది. అజేయ అర్ధశతకంతో రాణించిన ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ముంబై 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.