“పెదకాపు’ కథను ఎప్పుడో రాసుకున్నా. 1980 దశకంలో వచ్చిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాల్పనిక అంశాలతో సాగుతుంది. ఈ కథకు మా నాన్న స్ఫూర్తినిచ్చారు’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
ఏదైనా కొత్త పార్టీ వస్తుందంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందనే ఆశ ఉంటుంది. 80వ దశకంలో మా ఊరి రాజకీయల్లో నాన్న క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. కథ అనుకున్నప్పుడే రెండు భాగాలుగా తీయాలనుకున్నా. ఇదొక వైవిధ్యమైన కథ. హింస కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాలో కులం ప్రస్తావన ఉండదు. టైటిల్ చూసి కొందరు అలా అనుకుంటున్నారు. పది మందిని కాపాడే వాడే పెదకాపు. ఆ ఉద్దేశ్యంలో టైటిల్ పెట్టాం.
ఈ సినిమా కోసం హీరో విరాట్కర్ణ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సామాన్యుడి ప్రతినిధిగా తనదైన ఎమోషన్స్తో మెప్పించారు. ఇలాంటి జోనర్ సినిమాలు తీసి మెప్పించడం దర్శకులకు సవాలు వంటిది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన వారందరూ బాగుందని ప్రశంసించారు. స్వతహాగా నాకు ఫ్యామిలీ జోనర్ సినిమాలు ఇష్టం. సమాజంలో అత్యంత ముఖ్యమైనది కుటుంబమే. అందులోని భావోద్వేగాలను చూపించడం నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అన్ని జోనర్స్ సినిమాలు చేస్తా. తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్లో ఉంటుంది.