అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా కూడా పన్ను విరుగుద్ది అంటారు కదా.. ఇప్పుడు ఇదే జరుగుతుంది గోపీచంద్ విషయంలో. ఎంత పెద్ద హీరో అయినా కెరీర్ లో ఏదో ఒక సినిమా మాత్రం కొన్ని సంవత్సరాల పాటు విడుదలకు నోచుకోకుండా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు అలాంటి సినిమాలు ఉన్నాయి. గోపీచంద్ కూడా దీనికి మినహాయింపు కాదు. అన్నీ అనుకున్నట్లు జరుగుంటే ఈ పాటికి గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా వచ్చి కూడా 4 సంవత్సరాలు అయ్యుండేది. కానీ ఏం చేస్తాం.. టైమ్ బాగోలేనపుడు అరటిపండు తిన్నా పన్నురుగుద్ది అంటారు. ఇది నిజమే అనిపిస్తుందిప్పుడు. ఎప్పటికప్పుడు కొత్త రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ఆ తర్వాత పూర్తిగా సినిమా విషయమే మరిచిపోయారు దర్శక నిర్మాతలు.
నాలుగేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్న ఈ చిత్రం ఇప్పుడు కూడా అదే ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయింది. ఈ సినిమాను భారీ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించాడు తాండ్ర రమేష్. దాదాపు 18 కోట్లతో ఆరడుగుల బుల్లెట్ తెరకెక్కింది. ఈ చిత్రానికి ఇంకా బకాయిలు ఉన్నాయి. సినిమా విడుదలైన తర్వాత సెటిల్ చేస్తానని నిర్మాత చెప్పినా బయ్యర్లు వినడం లేదు. పక్కాగా డబ్బులు కట్టిన తర్వాత గానీ సినిమా విడుదల కానివ్వమంటున్నారు. దాంతో చేసేదేం లేక కామ్ గా ఉండిపోయాడు నిర్మాత. ఈ చిత్రానికి వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ప్రకాశ్ రాజ్, నయనతార లాంటి స్టార్ క్యాస్ట్ ఉంది. అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆరడుగుల బుల్లెట్ పరిస్థితి తయారైంది.
ఫైనాన్షియర్లకు క్లియర్ చేయాల్సిన అమౌంట్ ఇస్తే గానీ సినిమా విడుదల కాదు. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేద్దామని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ కు యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ వుండటం.. నయనతార హీరోయిన్ కావడంతో ఈ సినిమాను మంచి రేటుకి తీసుకుంటున్నారు డిజిటల్ సంస్థలు. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటిటి సంస్థ 15 కోట్లకు డీల్ కూడా మాట్లాడేసినట్లు తెలుస్తుంది. అయితే కొన్నేళ్ళ కింద జీ వాళ్ళకు ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ హక్కులు 8 కోట్లకు అమ్మేసినట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో వాళ్లు ఆరడుగుల బుల్లెట్ ఓటిటి రిలీజ్ కు అడ్డు తగులుతున్నారు. తమకు అమ్మిన తర్వాత ఇప్పుడు రేట్ ఎక్కువ వచ్చిందని ఇతరులకు ఎలా అమ్మేస్తారంటూ వాళ్లు నిలదీస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఎలాగోలా అన్నీ క్లియర్ చేసి ఆగస్టులో విడుదల చేయనున్నట్లు నిర్మాతలే ఖరారు చేసారు. మరి ఇప్పటికైనా ఆరడగులు బుల్లెట్ దిగుతుందో లేదో చూడాలి.