న్యూఢిల్లీ, మార్చి 19: కేంద్ర చట్టాలపై అభిప్రాయం తెలిపే హక్కు రాష్ర్టాల అసెంబ్లీలకు ఉందా లేదా అన్నది తెలుపాలని పిటిషన్దారైన ‘సమతా ఆందోళన సమితి’ అనే స్వచ్ఛంద సంస్థను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేయాలని సూచించింది. సీఏఏ, నూతన వ్యవసాయ చట్టాలు వంటి కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ర్టాల అసెంబ్లీలు తీర్మానం చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీలకు లేదని పేర్కొన్నారు. సంబంధిత చట్టాలపై ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయని, న్యాయపరిధిలోని అంశాలపై తీర్మానాలు చేయడం సరికాదని అన్నారు. కోర్టు విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.