న్యూఢిల్లీ : తమ పాలసీలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు మే నెలలో 19 లక్షల భారత ఖాతాలను బ్యాన్ చేసినట్టు ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 నిబంధనల కింద తాజా నివేదికలో వాట్సాప్ ఈ వివరాలను తెలిపింది.
ఐటీ నిబంధనలకు అనుగుణంగా మే 1 నుంచి మే 30 వరకూ నూతన నివేదికను వెల్లడించామని, ఇందులో యూజర్ల ఫిర్యాదులు దానిపై తాము తీసుకున్న చర్యల వివరాలు పొందుపరిచామని వాట్సాప్ ప్రతినిధి పేర్కొన్నారు. తమ వేదికపై వేధింపులు, అభ్యంతరకర కంటెంట్పై చర్యలు తీసుకునేందుకు చొరవ తీసుకున్నామని చెప్పారు.
తమ వేదికపై యూజర్ల భద్రత కోసం ఏఐతో పాటు ఇతర సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నామని తెలిపారు. కంపెనీ పాలసీలు, మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఖాతాలను బ్యాన్ చేశామని చెప్పారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఖాతాలతో పాటు నిర్ధారణ కాని మెసేజ్లను పలు కాంటాక్ట్లకు ఫార్వార్డ్ చేసే యూజర్ల ఖాతాలపైనా వేటు వేశామని వివరించారు.