హైదరాబాద్ : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం వాట్సాప్ కొత్తగా భారత్లో రెండు కీలకమైన భద్రత ఫీచర్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ను తీసుకువచ్చిన వాట్సాప్ తాజాగా.. స్మార్ట్ఫోన్లో వినియోగించే యాప్లో ఫ్లాష్ కాల్స్ అండ్ మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ అనే ఫీచర్లను తీసుకొచ్చింది. ఫ్లాష్ కాల్స్ మొబైల్ ఫోన్లలో ఖాతాను నిర్ధారించేందుకు ఉపయోగపడనున్నది.
యూజర్లు ఫోన్ మార్చిన సమయంలో వాట్సాప్లోకి వెళ్లి రిజిస్టర్డ్ ఫోన్ నంబరును ఎంటర్ చేస్తే వెంటనే ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేశాక పాత వాట్సాప్ ఖాతానే కొత్త ఫోన్లోనూ వినియోగించుకునే వీలు ఉంటుంది. మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ ఫీచర్ సహాయంతో ఎవరినైనా బ్లాక్ చేయడానికి లేదా రిపోర్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అసభ్యకరమైన సందేశాలు పంపేవారిని, వేధింపులకు పాల్పడే వారిని ఈ ఆప్షన్ ఉపయోగించి బ్లాక్ చేయొచ్చు.
వాట్సాప్ ఇంటర్నేషనల్ టీమ్ బ్యాక్రౌండ్ వెరిఫికేషన్ చేసి సదరు వ్యక్తులు వాట్సాప్ను వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. అంతకుముందు ఈ ఫీచర్స్ ఉన్నప్పటికీ మల్టిపుల్స్ స్టెప్స్లో చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవరినైతే బ్లాక్ చేయాలనుకుంటున్నామో వాళ్లు పంపిన మెసేజ్పై లాంగ్ప్రెస్ చేస్తే రిపోర్ట్ అండ్ బ్లాక్ అనే ఆప్షన్లు వస్తాయని వాట్సాప్ పేర్కొంది.