న్యూఢిల్లీ: పెగాసస్.. రెండేళ్ల కిందట కొందరు వాట్సాప్ యూజర్లను వణికించిన ఈ స్పైవేర్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి కొందరు కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యాయన్న వార్త సంచలనం సృస్టించింది. ప్రముఖ అంతర్జాతీయ సైట్లయిన గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్లాంటివి ఈ పెగాసస్ ఉపయోగించి ప్రభుత్వాలు ఎలా నిఘా వేస్తున్నాయో వివరిస్తూ స్టోరీలు రాశాయి. ఈ పెగాసస్ స్పైవేర్ ( Pegasus spyware ) కేవలం ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండటంతో.. తాజా హ్యాకింగ్ కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ స్పైవేర్ ప్రధానంగా జర్నలిస్ట్లనే లక్ష్యంగా చేసుకున్నట్లు గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించాయి. ఇందులో ఇండియాకు చెందిన 40 మందికిపై జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, కీలక పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధుల ఫోన్లు హ్యాక్ అయినట్లు చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా ఇండియా సహా 10 ప్రభుత్వాలు ఈ పెగాసస్ స్పైవేర్ను ఉపయోగిస్తున్నాయి. అయితే గార్డియన్ కథనాన్ని ఖండిస్తూ భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని, దాని అత్యున్నత సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నదని ఆరోపించినా.. తాము హ్యాకింగ్ చేశామా లేదా అన్నదానిపై స్పష్టంగా సమాధానం చెప్పలేదు.
ఇదొక స్పైవేర్. దీనిని ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అభివృద్ధి చేసింది. ఈ సంస్థ సైబర్ ఆయుధాలుగా నిపుణులు అభివర్ణించే వాటిని తయారు చేస్తుంది. ఈ పెగాసస్ తొలిసారి 2016లో వెలుగులోకి వచ్చింది. ఆ ఏడాది ఓ అరబ్ సామాజిక కార్యకర్త.. తన ఫోన్కు ఓ అనుమానాస్పద మెసేజ్ రావడంతో ఏడో జరిగినట్లు అనుమానించారు. మొదట్లో ఈ పెగాసస్ కేవలం ఐఫోన్ యూజర్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తేలడంతో ఆపిల్ సంస్థ ఈ లోపాన్ని సవరిస్తూ అప్డేట్ తీసుకొచ్చింది.
అయితే ఏడాది తర్వాత ఈ స్పైవేర్ ఆండ్రాయిడ్ యూజర్లనూ టార్గెట్ చేయగలదని తేలింది. 2019లో ఈ స్పైవేర్ను సృష్టించిన ఎన్ఎస్వో సంస్థపై ఫేస్బుక్ కేసు కూడా ఫైల్ చేసింది. ఇండియాలోని పలువురు జర్నలిస్టులు, యాక్టివిస్టుల అకౌంట్లను ఈ స్పైవేర్ ఉపయోగించి హ్యాక్ చేసినట్లు ఫేస్బుక్ గుర్తించింది. అదే సమయంలో ఇండియాలోని యూజర్లకు ఈ స్పైవేర్ గురించి వాట్సాప్ హెచ్చరించింది.
ఫోన్ హ్యాకింగ్కు ఇంతకు మించిన స్పైవేర్ లేదన్నది నిపుణుల మాట. ఈ పెగాసస్ ఉన్నట్లు ఎన్ఎస్వో గ్రూపు కూడా పబ్లిగ్గానే చెప్పింది. అయితే తాము ఈ స్పైవేర్ను కేవలం ప్రభుత్వాలకు అమ్ముతామని, దీనిని దుర్వినియోగం చేస్తే తమ బాధ్యత లేదనీ చెప్పింది.
ఇది ఫోన్ను హ్యాక్ చేసే విధానం వల్లే ఇది ప్రపంచంలోనే అల్టిమేట్ స్పైవేర్గా పేరుగాంచింది. అసలు యూజర్కు తన ఫోన్ హ్యాక్ అయినట్లు ఏమాత్రం అనుమానం రాకుండా చేయడమే దీని ప్రత్యేకత. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి మొబైల్కు హానికారక వెబ్సైట్ లింక్ను పంపిస్తారు. దీనిపై క్లిక్ చేస్తే వాళ్ల ఫోన్లో పెగాసస్ ఇన్స్టాల్ అయిపోతుంది. అంతేకాదు వాట్సాప్లాంటి వాటిని ఉపయోగించి చేసే వాయిస్ కాల్స్లో ఓ సెక్యూరిటీ బగ్ ద్వారా కూడా దీనిని ఫోన్లో ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక అన్నింటికంటే కేవలం ఓ మిస్డ్ కాల్ ద్వారా కూడా ఈ స్పైవేర్ను టార్గెట్ యూజర్ మొబైల్లో ఇన్స్టాల్ చేసే అవకాశం ఉండటం ఆందోళన కలిగించేది. అలా ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది కాల్ రికార్డ్ను చెరిపేస్తుంది. దీంతో ఆ యూజర్కు ఆ మిస్డ్ కాల్ గురించి కూడా తెలియదు.
ఒక్కసారి పెగాసస్ ( Pegasus ) ఫోన్లో ఇన్స్టాల్ అయిందంటే ఇక అందులోని ప్రతి సమాచారంపై నిఘా వేయొచ్చు. వాట్సాప్ ద్వారా పంపించే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్లను కూడా చూడొచ్చు. ఈ పెగాసస్ మెసేజ్లను రీడ్ చేయగలదు.. కాల్స్ ట్రాక్ చేయగలదు.. యాప్స్లో యూజర్ యాక్టివిటీ, లొకేషన్ డేటా, వీడియో కెమెరాలు, మైక్రోఫోన్లో మాట్లాడే మాటలు.. ఇలా ప్రతిదాన్నీ పెగాసస్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే యూజర్ ఫోన్లో చేసే ప్రతి యాక్టివిటీని పెగాసస్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఓ ప్రభుత్వం ఎవరిపై అయినా నిఘా వేయాలనుకుంటే.. ఈ పెగాసస్ను మించిన స్పైవేర్ మరొకటి లేదు. అంతేకాదు ఇది 60 రోజుల పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్తో కమ్యూనికేట్ చేయలేకపోయినా, లేదంటే తప్పుడు యూజర్ మొబైల్ను హ్యాక్ చేసినా.. తనకు తానుగా ఈ స్పైవేర్ పని చేయడం ఆగిపోతుంది.
నిజానికి ఈ క్లాసిక్ పెగాసస్ అనేది ఇప్పుడు లేదు. ప్రస్తుతం నడుస్తున్న చర్చ కూడా గతంలో చేసిన హ్యాక్కు సంబంధించినవే. దీని గురించి బయటకు తెలియగానే.. ఆపిల్తోపాటు గూగుల్, వాట్సాప్లు కూడా సెక్యూరిటీ అప్డేట్లు తీసుకొచ్చి లోపాలను సవరించాయి. ప్రస్తుతం మీ ఆపిల్ ఫోన్లో ఐఓఎస్ 14, ఆండ్రాయిడ్ 11, లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్లు ఉంటే ఈ పెగాసస్ స్పైవేర్ మీ ఫోన్ను హ్యాక్ చేయలేదు. అయితే దీనిని అభివృద్ధి చేసిన ఎన్ఎస్వో గ్రూప్ ఇప్పటికీ ఉంది. ఇది ఈ పెగాసస్ను అప్డేట్ చేయడం లేదంటే మరో కొత్త స్పైవేర్ను అభివృద్ధి చేస్తేనే యూజర్ల మొబైల్స్కు ముప్పు.