న్యూయార్క్ : మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఈసారి పాలసీ టీం సభ్యుల వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. అక్టోబర్లో ట్విట్టర్ను టేకోవర్ చేసిన అనంతరం ఎలన్ మస్క్ ఎడాపెడా లేఆఫ్స్కు తెగబడుతుండగా తాజాగా పాలసీ టీం సభ్యుల్లో సగం మందిని కంపెనీ గత వారం సాగనంపిందని సమాచారం.
భావప్రకటనా స్వేచ్ఛ, గోప్యత, ఆన్లైన్ సేఫ్టీ వంటి అంశాలపై చట్టసభ సభ్యులు, పౌరసమాజంతో సంప్రదింపులు సాగించే పాలసీ టీంలోనూ కొలువుల కోత చేపట్టారు. ప్రజలను రెచ్చగొట్టే కంటెంట్ను తొలగించాలని అధికారులు, పౌరహక్కుల సంస్ధల నుంచి వచ్చే వినతులను కూడా ఈ టీం హ్యాండిల్ చేస్తుంటుంది. అయితే తాజా లేఆఫ్స్ క్రిస్మస్ ముందు జరగడం ఉద్యోగులకు షాక్ ఇస్తోంది.
ట్విట్టర్ పబ్లిక్ పాలసీ టీంలో దాదాపు సగం మంది ఉద్యోగులపై కంపెనీ వేటువేసిందని ఈ విభాగంలో పనిచేసే థెరొడ స్కిడస్ వెల్లడించారు. ఇప్పుడు ట్విట్టర్కు గుడ్బై చెప్పేందుకు తన వంతు వచ్చిందని ఆమె ట్వీట్ చేశారు. తన డ్రీమ్ జాబ్లో భాగంగా ఇరాన్, ఉక్రెయిన్, లిబియా వంటి అంతర్జాతీయ వివాదాల్లో ప్రజలను కాపాడేందుకు తాము పనిచేసినందుకు గర్వంగా ఉందని ఆమె రాసుకొచ్చారు. ఇక ట్విట్టర్ పబ్లిక్ పాలసీ చీఫ్ సినిద్ మెక్స్నీ కంపెనీ నుంచి వైదొలగారని వార్తలు వచ్చాయి. మెక్స్నీ స్ధానంలో గ్లోబల్ పబ్లిక్ పాలసీ స్ట్రేటజీ సీనియర్ డైరెక్టర్ నియమితులైనట్టు సమాచారం.