న్యూఢిల్లీ : డ్రీం కంపెనీల్లో జాబ్ కొట్టేందుకు ఉద్యోగార్ధులు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కంపెనీలు సైతం డ్రీం ఎంప్లాయిస్ గురించి ఎలాంటి అంచనాలతో ఉంటాయనే విషయం అరుదుగానే ఆలోచిస్తుంటారు. అసలు టెక్ దిగ్గజం యాపిల్ తన ఉద్యోగుల నుంచి ఏం ఆశిస్తుంది..అభ్యర్ధుల ఎంపికలో ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందనే వివరాలను ఏకంగా సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు.
టిమ్ కుక్ ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ నేపుల్స్ పెడెరికోలో జరిగిన ఓ కార్యక్రమం వేదికగా ఈ విషయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్స్ను ఉద్దేశించి కుక్ మాట్లాడుతూ తమ ఉద్యోగులు అనుసరించే కల్చర్పైనే యాపిల్ విజయం ఆధారపడిఉందని చెప్పుకొచ్చారు. తమ కంపెనీ ప్రధానంగా నాలుగు నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటుందని వివరించారు. ఇదే తాము అనుసరించే మెరుగైన ఫార్ములా అని స్పష్టం చేశారు.
సహకార, సమన్వయ స్వభావం, సృజనాత్మకత, ఉత్సుకత, నైపుణ్యం అనే నాలుగు కీలక అంశాలను అభ్యర్ధుల్లో చూస్తామని పేర్కొన్నారు. మూడు ఇతర నైపుణ్యాల సమాహారంతో కూడిన సహకార, సమన్వయ స్వభావం అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు. తాను ఓ ఐడియాను మీతో పంచుకుంటే అది పెద్దదిగా మరింత పెద్దదిగా మెరుగైనదిగా మారుతుందని ఆ సహకార, సమన్వయ ప్రక్రియతోనే యాపిల్ దీటైన ఉత్పత్తులను సృష్టించేందుకు దోహదపడుతుందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు.