న్యూఢిల్లీ: ఈ పోటీ ప్రపంచంలో గెలవడమే కాదు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమూ ముఖ్యమే. టాప్లో ఉన్న వాళ్లు ఏమాత్రం తడబడినా కింద ఉన్న వాళ్లు ఆ స్థానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న కాలమిది. ప్రస్తుతం మెసేజింగ్ యాప్స్ వాట్సాప్, టెలిగ్రామ్( Telegram )లను చూస్తే ఈ విషయం తెలుస్తుంది. వాట్సాప్ తప్పిదాలు ప్రత్యర్థి టెలిగ్రామ్కు బాగా కలిసొస్తున్నాయి. ఆ మధ్య కొత్త ప్రైవసీ పాలసీ తీసుకు రావడంతో ఇండియాలోని చాలా మంది వాట్సాప్ యూజర్లు దానిని వదిలేసి టెలిగ్రామ్ వైపు వెళ్లారు. ఇక ఇప్పుడు ఒకేసారి వాట్సాప్ సేవలు ఏడు గంటల పాటు నిలిచిపోవడంతో టెలిగ్రామ్ మరోసారి పండగ చేసుకుంది.
7 కోట్ల మంది కొత్త యూజర్లు
ఒకటీ రెండూ కాదు.. ఏడు గంటల్లో ఏకంగా 7 కోట్ల మంది కొత్త యూజర్లను టెలిగ్రామ్ సంపాదించడం విశేషం. సాంకేతిక లోపం కారణంగా గంటల పాటు వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్ల మంది యూజర్లు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో చాలా మంది టెలిగ్రామ్, సిగ్నల్ సేవలను వాడటం ప్రారంభించారు. ఈ వాట్సాప్ అవుటేజ్ సమయంలో తమకు కొత్తగా 7 కోట్ల మంది యూజర్లు వచ్చినట్లు టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ చెప్పారు.
ఇంత సడెన్గా అంత మంది యూజర్లు వచ్చినా ఇబ్బంది కలగకుండా చూసుకున్న తన టీమ్ను కూడా ఆయన అభినందించారు. ఒకేసారి కోట్ల మంది యూజర్లు టెలిగ్రామ్కు సైనప్ చేయడంతో తమ సేవలు కాస్త నెమ్మదించినట్లు కూడా పావెల్ తెలిపారు. టెలిగ్రామ్కు ఇప్పటి వరకూ 100 కోట్లకుపైగా డౌన్లోడ్లు ఉన్నాయి. అందులో 50 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. టెలిగ్రామ్ ఒక్కటే కాదు వాట్సాప్ అవుటేజ్ సమయంలో సిగ్నల్ కూడా బాగానే లాభపడింది.