న్యూఢిల్లీ: దేశంలో బ్రెయిన్ స్ట్రోక్తో మరణించే వారి సంఖ్య అసాధారణ స్థాయిలో ఉందనడానికి తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జనరల్లో బుధవారం ప్రచురితమైన ఒక అధ్యయన పత్రమే నిదర్శనం. ఆ అధ్యయన పత్రం ప్రకారం.. దేశంలో ఒక్క 2019 ఏడాదిలోనే 6,99,000 మంది బ్రెయిన్ స్ట్రోక్తో ప్రాణాలు కోల్పోయారు. 2019 ఏడాదిలో సంభవించిన మొత్తం మరణాల్లో ఈ బ్రెయిన్ స్ట్రోక్ మరణాల శాతం 7.4 శాతంగా ఉన్నది.
దేశంలో నమోదైన నాన్ కమ్యూనికేబుల్ న్యూరలాజికల్ డిజార్డర్స్, కమ్యూనికేబుల్ న్యూరలాజికల్ డిజార్డర్స్, న్యూరలాజికల్ ఇంజ్యూరీస్ కలిపి మొత్తం నరాల సంబంధ వ్యాధుల భారం 1990 – 2019 సంవత్సరాల మధ్య 29 ఏండ్ల వ్యవధిలో రెండింతలయ్యింది. తాజా అధ్యయనం పత్రం ప్రకారం.. ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్, టెటానస్ లాంటి రుగ్మతలను కమ్యూనికేబుల్ న్యూరలాజికల్ డిజార్డర్స్గా పేర్కొన్నారు.
అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్, వివిధ రకాల తలనొప్పులు, ఎపిలెప్సీ, సెరిబ్రల్ పాల్సీ, అల్జీమర్స్, డెమెంటియాస్, బ్రెయిన్ అండ్ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ క్యాన్సర్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మోటార్ న్యూరాన్ డిసీజెస్, ఇతర న్యూరలాజికల్ డిజార్డర్లను నాన్ కమ్యూనికేబుల్ డిజార్డర్లుగా.. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీస్, స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్ను ఇంజ్యూరీ రిలేటెడ్ న్యూరలాజికల్ డిజార్డర్లుగా తాజా అధ్యయన పత్రంలో పేర్కొన్నారు.