న్యూయార్క్: పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలతో నడిచే వాహనాల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలను) అందుబాటులోకి తెస్తున్నాయి. కానీ, బ్యాటరీల చార్జింగ్కు చాలా సమయం పడుతుండటం ఈవీల వినియోగానికి ప్రధాన అవరోధంగా పరిణమిస్తున్నది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికాలోని కార్నెల్ ఇంజినీరింగ్ విద్యాసంస్థ ప్రొఫెసర్ లిండెన్ ఆర్చర్ నేతృత్వంలోని పరిశోధక బృందం సరికొత్త లిథియం బ్యాటరీని అభివృద్ధి చేసింది. కేవలం 5 నిమిషాల్లోపే చార్జ్ కావడం దీని ప్రత్యేకత. ఈ బ్యాటరీ అందుబాటులోకి వస్తే ఈవీల చార్జింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అగత్యం తప్పడంతోపాటు విద్యుత్తు వాహనాల వినియోగం ఊపందుకుంటుంది.
వాస్తవానికి విద్యుత్తు వాహన రంగంలో సాంకేతికత ఇప్పటికే కొంత మేరకు అభివృద్ధి చెందింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేగవంతమైన వాణిజ్య చార్జర్ సాయంతో ఒక ఈవీని చార్జ్ చేసేందుకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతున్నది. ఇది ఇండ్లలో వాడే సాధారణ చార్జర్ కంటే చాలా మెరుగైనదే అయినప్పటికీ ఈవీల వినియోగాన్ని పెంచేందుకు మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉన్నది.
ఒక ఈవీ బ్యాటరీని మనం కేవలం 5 నిమిషాల్లో చార్జ్ చేసుకోగలిగితే 300 మైళ్ల దూరం ప్రయాణించేందుకు అవసరమైన భారీ బ్యాటరీని కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరకు లభ్యమయ్యే బ్యాటరీతోనే సరిపెట్టుకోవచ్చని, దీంతో విద్యుత్తు వాహనాల ధరలు తగ్గి వినియోగం కూడా పెరుగుతుందని ఆర్చర్ వివరించారు.