DRDO : హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ): డీఆర్డీవో డైరెక్టర్ జనరల్గా ప్రముఖ శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజబాబు(Ummalaneni Rajababu) నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ బీహెచ్వీఎస్ నారాయణమూర్తి (BHVS Narayanamurthy) బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. దాంతో, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న రాజబాబును ఈ పదవికి ఎంపిక చేశారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐటీ ఖరగ్పూర్ నుంచి మాస్టర్స్, జేఎన్టీయూ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 1988లో వైమానిక దళంలో కెరీర్ ప్రారంభించిన రాజబాబు 1995లో డీఆర్డీవోలో చేరారు.
35ఏళ్ల సర్వీస్లో ఆయన ప్రొఫెషనల్ ఏరోస్పేస్ కెరీర్లో, విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణి వ్యవస్థల అభివృద్ధి కోసం పనిచేశారు. అంతేకాదు ఆర్సీఐలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ సామర్థ్యాల రూపకల్పనలోనూ కీలక భూమిక పోషించారు. క్లిష్టమైన సాంకేతికత, మిషన్ మోడ్ ప్రాజెక్ట్ల అభివృద్ధి, క్రూయిజ్ క్షిపణులు, సాయుధ దళాల ఆయుధ వ్యవస్థల కోసం అధునాతన క్షిపణి ఏవియానిక్స్ అభివృద్ధిలోనూ ఆయన పాలుపంచుకున్నారు. రాజబాబు నేతృత్వంలోనే “మిషన్ శక్తి”, భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహ క్షిపణి పరీక్ష (ఏ సాట్) విజయవంతం కావడం విశేషం. మిషన్ శక్తిని విజయవంతం చేసినందుకు పాత్ బ్రేకింగ్ రీసెర్చ్, అత్యుత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డుతో పాటు డీఆర్డీవో శాస్త్రవేత్త ఆఫ్ ది ఇయర్, విజ్ఞాన్ ప్రతిభా సమ్మాన్ తదితర అవార్డులను రాజబాబు అందుకున్నారు.