భూమిపై జీవం ఎలా పుట్టింది? భూమిపైకి జీవం మూలం మొదట ఎలా చేరింది? ఇది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఈ గుట్టు విప్పేందుకు పరిశోధకులు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. కాగా, జపాన్ శాస్త్రవేత్తలకు తాజాగా ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి. జపనీస్ స్పేస్ ప్రోబ్ ద్వారా సేకరించిన గ్రహశకలం ధూళి, శకలాలలో ఉన్న సేంద్రియ పదార్థాలు భూమిపై ఉన్న జీవంలో కూడా ఉన్నాయని తేల్చారు. 300 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ర్యుగు’ అనే గ్రహశకలం నుంచి 2020లో కొన్ని నమూనాలు తీసుకొచ్చారు.
గ్రహశకలంపై తెచ్చిన నమూనాల్లో శాస్త్రవేత్తలు 5.4 గ్రాముల (0.2 ఔన్సుల) చిన్న రాళ్లలో చిన్న భాగాలపై అధ్యయనం ప్రారంభించారు. వీటిలో భూమిపై ఉన్న జీవం పుట్టుకకు కారణమైన అమైనో ఆమ్లాలతోపాటు జీవం మూలాలకు సంబంధించిన ఇతర కర్బన పదార్థాలున్నట్లు పశ్చిమ జపాన్లోని ఓకాయామా విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం గుర్తించింది.
‘ర్యుగు గ్రహశకలంపై అమైనో ఆమ్లాల కలయిక వల్ల ఏర్పడే ప్రొటీన్ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఉల్కలలాగా రుగ్యు గ్రహశకలం భూమిని ఢీకొట్టలేదు. అంటే జీవం మూలాలు అంతరిక్షంలో ఏర్పడ్డాయని దీని వల్ల అర్థమవుతున్నది.’ అని అధ్యయనం తెలిపింది. 2019లో జపాన్కు చెందిన ‘హయాబుసా-2’ ప్రోబ్ సేకరించిన శాంపిల్ను పరిశీలించగా, 23 రకాల అమైనో యాసిడ్లను కనుగొన్నట్లు బృందం తెలిపింది.
ఉల్కలతో సహా మానవాళికి అందుబాటులో ఉన్న ఏదైనా సహజ నమూనాలో ర్యుగు నమూనా అత్యంత ప్రాచీన లక్షణాలను కలిగి ఉందని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. భూమిపై జీవం మూలం అంతరిక్షం నుంచే వచ్చిందనేదానికి ఈ నమూనా నిదర్శనంగా నిలుస్తుందని తెలిపింది.