REDMI 15C 5G | బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను రూపొందించి అందించే కంపెనీగా షియోమీ ఎంతటి పేరుగాంచిందో అందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన రెడ్మీ ఫోన్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందులో భాగంగానే వారికి కావల్సిన ఫీచర్లను ఆయా ఫోన్లలో అందిస్తూ షియోమీ పేరుగాంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఇదే సిరీస్లో మరో నూతన స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెడ్మీ 15సి 5జి పేరిట ఈ ఫోన్ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందించడంతోపాటు దీని ధర కూడా చాలా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్లో 6.9 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. కనుక డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఫోన్కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. మరో సెకండరీ కెమెరా కూడా ఉంది. అలాగే ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇది ముందు వైపు ఉన్న నాచ్లో అమర్చబడి ఉంటుంది. ఇక ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ర్యామ్ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్గా పెంచుకునే వీలు కల్పించారు. అందువల్ల ఫోన్ ఎలాంటి ల్యాగ్ లేకుండా వేగంగా పనిచేస్తుంది. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్ 2 ను ఇచ్చారు. దీనికి గాను 2 ఏళ్ల వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను పక్క భాగంలో ఇచ్చారు.
ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ను సైతం అందిస్తున్నారు. కనుక ఫోన్ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ను లాంచ్ చేశారు. ఇందులో మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ కాదు కనుక 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో ఎస్డీ కార్డును ఒకేసారి ఫోన్లో వేసుకోవచ్చు. ఈ ఫోన్కు 3.5ఎంఎం ఆడియో జాక్ను కూడా ఇస్తున్నారు. ఎఫ్ఎం రేడియో సదుపాయం కూడా ఉంది. ఐపీ 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా ఉంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లను సైతం ఇందులో అందిస్తున్నారు.
రెడ్మీ 15సి 5జి స్మార్ట్ ఫోన్ను డస్క్ పర్పుల్, మూన్లైట్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,499 ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.15,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ను అమెజాన్తోపాటు ఎంఐ ఆన్ లైన్ స్టోర్, షియోమీ రిటెయిల్ స్టోర్స్లో డిసెంబర్ 11వ తేదీ నుంచి విక్రయించనున్నారు.