Chandrayaan-3 | చంద్రయాన్-3 మిషన్లో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి వెళ్లిన ప్రజ్ఞాన్ రోవర్ తనకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసింది. రేపట్నుంచి చంద్రుడిపై 14 రోజుల పాటు చీకటి ఉండనున్న నేపథ్యంలో రోవర్ను ఇస్రో స్లీప్ మోడ్లోకి పంపించింది. సురక్షితమైన ప్రాంతంలో పార్క్ చేసి.. రోవర్ను స్లీప్ మోడ్లోకి పంపించినట్లు ఇస్రో ప్రకటించింది. APXS, LIBS పేలోడ్లను కూడా టర్న్ ఆఫ్ చేశామని వెల్లడించింది. రోవర్ను స్లీప్ మోడ్లోకి పంపించేముందే తాము సేకరించిన డేటాను పేలోడ్లు ల్యాండర్ సహాయంతో భూమిపైకి చేరవేశాయని చెప్పింది.
ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీలు పూర్తిస్థాయిలో రీచార్జ్ అయ్యి ఉన్నాయని ఇస్రో తెలిపింది. మళ్లీ చంద్రుడిపై పగలు రాగానే కాంతిని గ్రహించేందుకు వీలుగా సోలార్ ప్యానెల్స్ను సిద్ధం చేసి ఉంచామని పేర్కొంది. మళ్లీ చంద్రుడిపై ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన వెలుతురు వస్తుందని.. అప్పుడు మళ్లీ సోలార్ ప్యానెల్స్ పనిచేసే అవకాశం ఉందని పేర్కొంది. అలా సోలార్ ప్యానెళ్లు మళ్లీ పనిచేస్తే.. ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్లో నుంచి బయటకొస్తుందని.. అప్పుడు దానికి కొత్త అసైన్మెంట్ అప్పజెప్తామని ఇస్రో తెలిపింది. లేదంటే చంద్రుడిపై భారత అంబాసిడర్గా శాశ్వతంగా ఉండిపోతుందని వ్యాఖ్యానించింది.
Chandrayaan-3 Mission:
The Rover completed its assignments.It is now safely parked and set into Sleep mode.
APXS and LIBS payloads are turned off.
Data from these payloads is transmitted to the Earth via the Lander.Currently, the battery is fully charged.
The solar panel is…— ISRO (@isro) September 2, 2023
చంద్రయాన్-3 దిగిన (Chandrayaan-3) చంద్రుడి దక్షిణ ధృవంపై లూనార్ నైట్ ప్రారంభం కానున్నది. భూ కాలమానం ప్రకారం ఇది 14 రోజులు కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉష్టోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. అలాగే లూనార్ నైట్ సమయంలో అక్కడ సూర్య కాంతి ఉండదు. దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పని చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానల్స్ పని చేయవు. ఈ నేపథ్యంలో ల్యాండర్, రోవర్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్లీప్ మోడ్లోకి పంపించింది.
విక్రమ్, ప్రజ్ఞాన్ పూర్తిగా సూర్యరశ్మి ఆధారంగా పని చేస్తాయి. జాబిల్లిపై రాత్రయితే సుమారు -180 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అందుకే చంద్రుడిపై పగలు ఉండే 14 రోజులే వీటి జీవితకాలం అని ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత రాత్రి అవగానే ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ల్యాండర్, రోవర్లోని వ్యవస్థలు పని చేయవు. ల్యాండర్, రోవర్లోని వ్యవస్థలు సూర్యరశ్మి ఆధారంగా పని చేస్తాయి కాబట్టి.. 14 రోజుల తర్వాత అవి పని చేయడం దాదాపుగా అసాధ్యం. అయితే 14 రోజుల రాత్రి తర్వాత కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడితే ల్యాండర్, రోవర్ తిరిగి పని చేసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతల కారణంగా ల్యాండర్, రోవర్ సూర్యరశ్మితో ఇంధనాన్ని తయారు చేసుకొని మళ్లీ పని చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే జరిగితే అవి మరో లూనార్ డే వరకు సేవలు అందిస్తాయి. అలా జరిగితే బోనస్గానే భావించాలి. కానీ ల్యాండర్, రోవర్ రెండూ పని చేస్తేనే భూమికి సమాచారం చేరుతుంది. రోవర్ నేరుగా భూమిపైకి సమాచారాన్ని పంపించలేదు. ఈ కారణంగానే రోవర్ పని చేసినా, ల్యాండర్ వ్యవస్థ కుప్పకూలిపోతే మిషన్ వృథా అవుతుంది. అదే సమయంలో ల్యాండర్ ఒకటే పని చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. జాబిల్లి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ పరిశోధనలు చేసే రోవర్ పని చేయకపోయినా మిషన్ అక్కడితో ఆగిపోతుంది.